- కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సెక్రటరీని కలిసిన మంత్రి పొన్నం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని గౌరవెల్లి సహా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు త్వరగా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి తన్మయి కుమార్ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన అనుమతులపై చర్చించారు. ఇందులో భాగంగా గౌరవెల్లి, ఇతర ప్రాజెక్ట్ లకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేస్తే.. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించే అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ విదేశాల్లో ఉండటంతో తన్మయికుమార్ను కలిసి ప్రాజెక్టుల అనుమతులపై చర్చించినట్టు పేర్కొన్నారు. అయితే, సుప్రీంకోర్టు ధర్మాసనం మే 2025లో ఇచ్చిన ‘వనశక్తి’ తీర్పును ఇటీవల వెనక్కి తీసుకుందని, దీనిపై న్యాయసలహా తీసుకుని అనుమతులు మంజూరు చేస్తామని తన్మయికుమార్ చెప్పినట్టు మంత్రి వెల్లడించారు.
