నాపై అసత్య ప్రచారం జరుగుతుంది.. నేను సీఎం జగన్ సైనికురాలిని: మంత్రి రోజా

నాపై అసత్య ప్రచారం జరుగుతుంది.. నేను సీఎం జగన్ సైనికురాలిని: మంత్రి రోజా

తనపై అసత్య ప్రచారం జరుగుతుందని.. ప్రతిపక్షాలపై  వైసీపీ పర్యాటక శాఖ మంత్రి అర్ కె రోజా సెల్వమణి ఫైరయ్యారు. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాదని ఎల్లోమీడియా ప్రచారం చేస్తుందని ఆమె మండిపడ్డారు. డిసెంబర్ 19వ తేదీ మంగళవారం మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 175 నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులు లేక..  వైసీపీలో ఒకరికైనా సీటు దక్కకపోతే బాగుంటుందని ఎదురుచూస్తున్నారని సెటైర్ వేశారు.

 తనకు సీటు రాదని  ప్రచారం చేస్తున్నారని.. తనకు సీటు రాకపోయిన ముఖ్యమంత్రి జగన్ వెంటే ఉంటానన్నారు. తాను సీఎం జగనన్న సైనికురాలినని.. ఆయన మాటే తనకు శిరోధార్యం అన్నారు. కొంతమంది అసత్య ప్రచారంతో శునకానందం పొందుతున్నారని విమర్శించారు.  ఓడిపోతామనే భయంతో చంద్రబాబు, పవన్ రెండేసి నియోజకవర్గాల్లో సర్వే చేయించుకుంటున్నారని-.. ఈ సారి కూడా వారిని ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.  అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందు వరుసలో  ఉంటున్నానని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని  మంత్రి రోజా  స్పష్టం చేశారు.