
- అంగన్వాడీ టీచర్ల ప్రమోషన్ ఏజ్ 45 నుంచి 50కి పెంపు
- త్వరలో కొత్త ఫ్లేవర్స్లో బాలామృతం ఇస్తామని వెల్లడి
- మహిళా సంఘాల బస్సుల పేమెంట్ను చెల్లించిన ఆర్టీసీ
హైదరాబాద్, వెలుగు: చిన్నారులకు మరింత మెరుగైన పోషకాహరాన్ని అందించేందుకు మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాల బలోపేతం, పోషకాహార మిషన్, అంగన్వాడీ సేవల్లో మహిళా సంఘాలు తదితర అంశాలపై గురువారం సెక్రటేరియెట్లో మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో రివ్యూ చేపట్టారు. శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆఫీసుల్లోకి మార్చాలని అధికారులను ఆదేశించారు.
కొత్త అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించాలన్నారు. అలాగే మొబైల్ అంగన్వాడీ, కంటైనర్ అంగన్వాడీలను ఏర్పాటు చేయాలని.. వాటికి నిపుణులతో చర్చించి డిజైన్ను రెడీ చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకునేందుకు ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తేవాలని సూచించారు.
పోషకాహారంపై 100 రోజుల ప్రచారం
అంగన్వాడీ చిన్నారుల్లో పోషకాహర లోపాన్ని తగ్గించే విధంగా కార్యచరణ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశించారు. ఇందుకోసం ప్రోగ్రెస్ రిపోర్ట్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. వారికిచ్చే ఆహారంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా వంద రోజుల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అంగన్వాడీల్లో ఖాళీల భర్తీ, కారుణ్య నియామకాలను త్వరలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చిన్నారులకు అందించే బాలామృతంలో పంచదార లేకుండా సరికొత్త బాలామృతంను టీజీ ఫుడ్స్ సిద్ధం చేసింది. పిల్లలకు తీపి అనుభూతి కలిగించేలా కర్జూర పౌడర్ను మిక్స్ చేయనున్నారు. అంగన్వాడీల్లో అల్పాహారం కోసం కిచిడీ మిక్స్, ఉప్మా మిక్స్లను రెడీ చేశారు.
హెల్పర్లకు శుభవార్త
అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్లు ఇచ్చే వయసును 45 ఏండ్ల నుంచి 50 ఏండ్లకు పెంచుతూ మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి సీతక్క సంబంధిత ఫైల్పై గురువారం సంతకం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 50 ఏండ్ల మధ్య వయసు గల సుమారు 4,322 మంది అంగన్వాడీ హెల్పర్లకు టీచర్లుగా ప్రమోషన్లు పొందే అవకాశం ఏర్పడింది.
మహిళా సంఘాలకు ఆర్టీసీ ద్వారా రూ.కోటి ఆదాయం
మహిళా సంఘాలు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి అప్పగించిన 150 బస్సుల ద్వారా ఒక్కో నెలకు రూ.కోటి అందుకోనున్నాయి. ఒక్కో బస్సుకు ఆర్టీసీ నెలకు రూ.70 వేలు చెల్లిస్తున్నది. ఇందులో భాగంగా మొదటి నెల పేమెంట్ను ఆర్టీసీ చెల్లించింది. ఈ చెక్కును మంత్రి సీతక్క సమక్షంలో ఆర్టీసీ యాజమాన్యం నుంచి సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ అందుకున్నారు.