
- రిక్రూట్మెంట్లలో వ్యాజ్యాల తగ్గింపునకు సంస్కరణలు అవసరం: శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: పబ్లిక్ సర్వీస్ కమిషన్లు (పీఎస్సీ) నీతి, విశ్వాసం, న్యాయానికి సంరక్షకులుగా ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నియామక ప్రక్రియల్లో విపరీతంగా పెరుగుతున్న వ్యాజ్యాలను తగ్గించడానికి సంస్కరణల అవసరమ ని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ షామీర్పేట లోని నల్సార్ లా క్యాంపస్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో లీగల్ సమస్యలు– తగ్గింపు మార్గాలపై నేషనల్ లెవల్ వర్క్షాప్ ప్రారంభమైంది.
దీనికి యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, నల్సార్ వీసీ శ్రీకృష్ణదేవరావుతో పాటు 18 పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించి, మాట్లాడారు. ప్రతి వాజ్యం న్యాయపరమైన కేసు మాత్రమే కాదని, అది యువ అభ్యర్థుల ఆకాంక్షలు, కుటుంబాల స్థిరత్వం కోసం ఎదురుచూపులుగా ఆయన అభివర్ణించారు.
.నియామకాల్లో జాప్యం ఏర్పడితే అది పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని తగ్గిస్తుందని చెప్పారు. అభ్యర్థుల గోప్యతను కాపాడే డిజిటల్ వేదికలు, నియామక నోటిఫికేషన్లకు ముందస్తు న్యాయ పరిశీలన వంటి చర్యలతో టీజీపీఎస్సీ పారదర్శకతలో ఉదాహరణగా నిలుస్తోందన్నారు. లిటిగేషన్ (వ్యాజ్య) సమస్యలను ముందుగానే గుర్తించడానికి ఏఐ ఆధారిత న్యాయ విశ్లేషణలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో 8 పీఎస్సీల చైర్మన్లు, 13 మంది సభ్యులు, ఐదుగురు సెక్రటరీలు, 17 మంది సీనియర్ అధికారులతో పాటు యూపీఎస్సీ మెంబర్ దినేశ్ దాసా, జాయింట్ సెక్రటరీ సంతోష్ గోపాల్ అజ్మీరా, టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్, తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు లిటిగేషన్స్, నియామకాల్లో సవాళ్లు, న్యాయపరమైన అంశాలు.. పరిష్కార మార్గాలు తదితర అంశాలపై చర్చించారు.