హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్పార్టీ లేకుంటే ఈటల రాజేందర్ ఎక్కడ ఉండేవారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఆయనకు రాజకీయ కుటుంబ నేపథ్యం లేదని, రాజకీయ నాయకుడు కూడా కాదని అన్నారు. ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్పరిచయం చేసిన వ్యక్తి ఈటల. ఐదేళ్లుగా గ్యాప్ ఉందని అంటున్నారు. అయినా మంత్రి పదవి ఎలా వచ్చింది? తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారు’’ అని విమర్శించారు. టీఆర్ఎస్ఎల్పీలో రాజ్యసభ ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, కాలేరు వెంకటేశ్లతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పేరు, టీఆర్ఎస్ లేకుండానే ఎమ్మెల్యేగా గెలిచారా అని ప్రశ్నించారు. రెండు సార్లు మంత్రి పదవి, ఒకసారి ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చారన్నారు. అసెంబ్లీ వేదికకగా కుడి భుజం అని, తమ్ముడు అని చెప్పారని గుర్తు చేశారు. ‘‘అనేక అంశాల్లో కేసీఆర్ ఈటలను నమ్మారు. ఒకవేళ తప్పు చేయకపోతే, చేయలేదని నిరూపించుకోవాల్సింది. నచ్చని, మెచ్చని, దుమ్మెత్తి పోసిన పార్టీలో ఇయ్యాల జాయిన్ అవుతున్నారు. బీజేపీకి తెలంగాణకు ఏం చేసింది? కాళేశ్వరం సాయం చేశారా? హుజూరాబాద్కు ఏమైనా డబ్బులు ఇచ్చారా? వరవరరావును జైల్లో పడితే కేసీఆర్పలకరియ్యలేదంటున్నారు. అసలు ఆయనను జైల్లో పెట్టిన పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారో ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీని తిట్టిన వారిని ఎవరు విశ్వసించరు’’ అని మంత్రి అన్నారు.