తెలంగాణలో అత్యంతవైభవంగా జరిగే బోనాల ఉత్సవాలు విశ్వవ్యాప్తమయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమెరికా, లండన్, దుబాయ్, అస్ట్రేలియాలో ఉన్న తెలంగాణ బిడ్డలు.. ఆయా దేశాల్లో బోనాల పండగను ఘనంగా నిర్వహించుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియంలో పాత బస్తీ బోనాల ఉత్సవాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్లోని 3500 ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. ఇందుకోసం రూ. 15 కోట్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. బోనాల పండగలో భాగంగా జూలై 17న సామూహిక అమ్మవారి ఘటాల ఊరేగింపు, ప్రతిష్ఠాపన జరుగనుందని తెలిపారు. జూలై 24న బోనాల పండుగ, 25న అమ్మవారి ఘటాల ఊరేగింపుతో బోనాల జాతర ఉత్సవాలు ముగుస్తాయని మంత్రి తలసాని పేర్కొన్నారు.