
ఖమ్మం టౌన్, వెలుగు: ‘క్లీన్ ఖమ్మం’ కోసం ప్రజలు సహకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని 11వ డివిజన్ వరదయ్యనగర్లో బుధవారం నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ కాల్వల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా, చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు రోడ్లు, డ్రైనేజీల్లో చెత్త వేయొద్దని సూచించారు. అనంతరం 4వ డివిజన్ రాజీవ్నగర్ గుట్ట ప్రాంతంలో టీయూఎఫ్ఐడీసీ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
రాజీవ్నగర్ గుట్ట ప్రాంతంలో విద్యుత్ లైన్లు వేసేందుకు నిధులు చెల్లించామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో పెండింగ్లో ఉన్న అంతర్గత రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ప్రపోజల్స్ సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్ర, పబ్లిక్ హెల్త్ ఈఈ వి. రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.