- యువత మత్తు వదిలి మైదానాలకు చేరాలి
- మంత్రి వాకిటి శ్రీహరి
వరంగల్, వెలుగు : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిందని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. నాయిని విశాల్ ఫౌండేషన్, క్రెడాయ్, వరంగల్ రన్నర్స్, కియాన్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ఆదివారం గ్రేటర్ వరంగల్లో మారథాన్ నిర్వహించారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కలిసి హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం వద్ద మారథాన్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడా పాలసీని అమలుచేయబోతున్నట్లు తెలిపారు. యువత సమస్యలు, ఒత్తిడికి లోనుకాకుండా మత్తుకు దూరంగా, మైదానాలకు దగ్గరగా ఉండాలని సూచించారు. తాను రంజీ గేమ్స్ ఆడే టైంలో ఆటలు ఎందుకని తన తల్లిదండ్రులు తిట్టేవారని.. కానీ ఇప్పుడు ఆటలకు దూరంగా ఉంటున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు బాధపడుతున్నారన్నారు. జిల్లాలోని విజయ డెయిరీకి పూర్వ వైభవం తీసుకువస్తామని, రూ.35 కోట్లతో డెయిరీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మారథాన్ నిర్వహణకు కృషి చేసిన ఎమ్మెల్యే నాయిని, విష్ణువర్ధన్రెడ్డిని మంత్రి శ్రీహరి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి పాల్గొన్నారు.
