తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకట స్వామి..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకట స్వామి..

తెలంగాణ  కార్మిక, ఉపాధి కల్పన, మైనింగ్ శాఖా మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కుటుంబ సమేతంగా తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం (జూన్ 19) ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 

దర్శనం తర్వాత ఆలయ రంగనాయక మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. అదే విధంగా టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి శేష వస్ర్తంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి వివేక్ అన్నారు.  తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని, సంక్షేమ పథకాలు అమలు కావాలని శ్రీవారిని ప్రార్థించానని చెప్పారు.  

ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.. ఇందిరమ్మ పక్కా ఇండ్లు కట్టిస్తే 12 ఏళ్ల తెలంగాణ ప్రజల కల నెరవేరుతుందని మంత్రి తెలిపారు. రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్య శ్రీ, సన్నబియ్యం వితరణతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.