- కోట్ల జీతం తీసుకుంటూ సభలో ప్రజల కోసం మాట్లాడలేరా?
- అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ఎందుకు కుంగిందో చెప్పాలని డిమాండ్
- చెన్నూరును రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని వెల్లడి
కోల్బెల్ట్/చెన్నూరు/జైపూర్/గజ్వేల్, వెలుగు: ‘కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, లేదంటే రాజీనామా చేయాలి, అపోజిషన్ లీడర్గా కోట్ల రూపాయల జీతం తీసుకుంటున్నప్పుడు ప్రజల కోసం మాట్లాడాలే కదా..’అంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇప్పుడు ఫామ్ హౌస్లో పడుకున్నారని మండిపడ్డారు.
రూ.-లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేండ్లకే ఎట్లా కుంగిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, జైపూర్ మండలాల్లో పర్యటించిన మంత్రి.. చెన్నూరులో పలు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు మార్నింగ్ వాక్లో స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ఒక్క ప్రాజెక్ట్ అయినా చెక్కుచెదిరిందా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డికి కట్టబెట్టిన రూ.600 కోట్ల క్విడ్ ప్రోకోపై అసెంబ్లీలో చర్చ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రూ.43 వేల కోట్లను కాంట్రాక్టర్లకు, రూ.16 వేల కోట్లను టీచర్లకు చెల్లించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టాక చెన్నూరు రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. చెన్నూరుకు మరో 2 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో భీమారం, -చెన్నూరు మధ్య జోడువాగుల వద్ద నేషనల్ హైవే అభివృద్దికి రూ.100 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు మొదలవుతాయని చెప్పారు. జూనియర్, డిగ్రీ కాలేజీలకు నిధులు మంజూరు అయ్యాయన్నారు. ఈ నెలాఖరునాటికి 100 పడకల హాస్పిటల్ బిల్డింగ్ను ప్రారంభిస్తామని తెలిపారు.
చెన్నూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. గోదావరి పుష్కరాల కోసం చెన్నూరులో రూ.70 కోట్లతో భారీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు. మంత్రి వెంట చెన్నూరు మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ నాయకపు వినయ్, మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ ఉన్నారు. అంతకుముందు జైపూర్ మండలం ఇందారంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి వివేక్ వెంకటస్వామి, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.
అవినీతి బయటపడుతుందన్న భయంతోనే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, రాష్ట్రంలో పేరుకుపోయిన అప్పులు, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని మంత్రి వివేక్ డిమాండ్ చేశారు. అవినీతి వ్యవహారాలు బయటపడతాయన్న భయంతోనే ఆయన అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. కేసీఆర్కు దమ్ము, ధైర్యం ఉంటే సమావేశాలకు హాజరై చర్చలో పాల్గొనాలని సవాల్ చేశారు.
శనివారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల కేటాయింపులు, ప్రభుత్వ నిర్ణయాల్లో క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపించారు. ఉద్యమ పార్టీగా ఏర్పడిన బీఆర్ఎస్కు రూ.1,000 కోట్ల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తీరుతో గజ్వేల్ అభివృద్ధి కుంటుపడుతోందని, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.
ప్రజల సమస్యలపై స్పందించని ఎమ్మెల్యేలను ప్రజలు ‘మిస్సింగ్ ఎమ్మెల్యేలు’గా పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దేవేందర్రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎలక్షన్రెడ్డి, భూంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్లు విజయ్ మోహన్, సర్దార్ ఖాన్, ప్రభాకర్గుప్తా, పీసీసీ నాయకులు నాయిని యాదగిరి, మతీన్, మైనార్టీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు సమీర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్రెడ్డి, మండల అధ్యక్షుడు సుఖేందర్రెడ్డి పాల్గొన్నారు.
ఫిర్యాదుల బాక్స్ తెరిచిన మంత్రి వివేక్...
మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్ను శనివారం మంత్రి వివేక్ వెంకటస్వామి తెరిచి, పరిశీలించారు. మంత్రి నేతృత్వంలో రాష్ట్రంలోనే తొలిసారిగా చెన్నూరు క్యాంపు ఆఫీస్లో గత నెల 19న నియోజకవర్గ ప్రజల సమస్యలు, సూచనలు, ఫిర్యాదుల కోసం ‘ఫిర్యాదుల ఓపెన్ బాక్స్’ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బాక్స్ను ఓపెన్ చేయగా వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ మంజూరు చేయాలంటూ కొందరూ అప్లికేషన్లను ఆ బాక్స్లో వేశారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, డిమాండ్లను పరిష్కారించాలని సంబంధిత ఆఫీసర్లను మంత్రి వివేక్ ఆదేశించారు.
