- సీఎం కేసీఆర్ను కలిసి అనుమతి కోరుతం
- కొత్త బస్సులు కొనాలనుకుంటున్నం: మంత్రి పువ్వాడ
హైదరాబాద్, వెలుగు: త్వరలోనే ఆర్టీసీ చార్జీలు పెంచుతామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ‘‘ఇప్పటి వరకు ఆర్టీసీ చార్జీలు పెంచలేదు. డీజిల్ సెస్ లాంటి ఒకటి రెండు అంశాలతో చార్జీల పెంపు జరిగింది. ప్రజలు అంగీకరించారు.. సీఎం కేసీఆర్ ను కలిసి చార్జీలు పెంచాలని కోరుతం..” అని చెప్పారు. తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్ క్యాంపస్ లో నర్సింగ్ కాలేజీని గురువారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. డీజిల్పై కేంద్రం సుమారు రూ.40 పెంచిందన్నారు. లాభాల బాటలో ఉన్న సంస్థలను కేంద్రం అమ్ముకొస్తున్నదని ఆరోపించారు. అలాంటి సందర్భంలో టీఎస్ ఆర్టీసీని కాపాడుకుంటున్నామని అన్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఎంప్లాయ్ సొసైటీ కూడా మళ్లీ పునరుద్ధరిస్తున్నామన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచుతూ రాష్ట్రాలను వ్యాట్ తగ్గించాలని అడుగుతున్నది. ఇదెక్కడి న్యాయం.. పెంచేది మీరు తగ్గించాల్సింది మేమా?” అని మంత్రి ప్రశ్నించారు.
ఆర్టీసీని అమ్మేస్తే మోడీ వెయ్యి కోట్లిస్తన్నరు
ఆర్టీసీని అమ్మేస్తే రూ.1,000 కోట్లు ఇస్తామని మోడీ చెప్పినట్టు కేసీఆర్ చెప్పారని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కానీ, ఆ అవసరం ఇక్కడ లేదని, ఆర్టీసీని కాపాడుకుంటామని చెప్పారు.