ప్రైవేట్ హాస్పిటళ్లు తీరు మార్చుకోకుంటే సగం బెడ్లు తీసుకుంటం..

ప్రైవేట్ హాస్పిటళ్లు తీరు మార్చుకోకుంటే సగం బెడ్లు తీసుకుంటం..

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రైవేట్ హాస్పిటళ్లు ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేదంటే అన్ని హాస్పిటళ్లలో సగం బెడ్లను తీసుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఇలా తీసుకున్న బెడ్లలో సర్కార్ నిబంధనల ప్రకారం కరోనా ట్రీట్‌‌మెంట్ అందించడానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్స్‌పై 1,030 ఫిర్యాదులు వచ్చాయన్నారు. హైదరాబాద్‌లోని అన్ని హాస్పిటళ్లపై ఫిర్యాదులు వచ్చాయని, వాటికి షోకాజ్ నోటీసులు ఇచ్చామని చెప్పారు. వాళ్ల వివరాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తప్పు చేసినట్టు తేలిన హాస్పిటళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

సోమవారం ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. రాష్ట్రం లో కరోనా టెస్టులు, ట్రీట్‌‌మెంట్, ఇతర అంశాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్రం బృందం మంత్రి ఈటలతో భేటీ అయింది. ఈ సందర్భంగా ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లదోపిడీపై చర్చ జరగిందని ఈటల వెల్లడించారు. అవసరమైతే ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ ప్రయోగించి, కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందం సూచించిందని ఆయన చెప్పారు. అనవసర టెస్టులపై ఎన్నో ఫిర్యాదులు అధిక బిల్లులు, బిల్ స్లిప్స్ ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయడం, రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు అడ్వాన్స్‌ కడితేనే పేషెంట్‌‌ను చేర్చుకోవడంపై ఫిర్యాదులు వచ్చాయని ఈటల చెప్పారు. బెడ్లుఖాళీగా లేవని చెప్పడం, ఇన్సూరెన్స్‌ యాక్సెప్ట్ చేయకపోవడం, క్రెడిట్ కార్డుతో బిల్ కట్టడానికి అంగీకరించకపోవడం, డెడ్ బాడీ ఇవ్వకపోవడం, ఇతర ట్రీట్‌‌మెంట్ల కోసం వచ్చినవారికి కరోనా ప్యాకేజీ పేరిట అదనపు చార్జీలు చార్జీ వేయడం, కరోనా నిర్ధారణ పేరిట ఎక్స్రే, సిటీ స్కాన్‌చేయడం లాంటి ఫిర్యాదులు అందాయన్నారు.