మైనర్ వేధింపుల కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు

మైనర్ వేధింపుల కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు

శిక్ష విధించిన ఎల్ బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు

గచ్చిబౌలి,వెలుగు : మైనర్ పై  లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎల్ బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే..ప్రకాశం జిల్లాకు చెందిన కరి రవిశేఖర్(31) పెయింటర్ గా పనిచేస్తూ బాలానగర్ ఫిరోజ్ గూడలో ఉండేవాడు. బాలానగర్ పీఎస్ పరిధిలో దంపతులు ఓ గుడిసెలో ఉంటూ కూలీ పనిచేసేవారు. 2016 జనవరి 1న  దంపతులు కూలీపనికి వెళ్లగా..వీరి కుమార్తె ( 17) గుడిసెలో ఒంటరిగా ఉంది. దీన్ని గమనించిన రవిశేఖర్ గుడిసెలోకి వెళ్లి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించాడు.

బాలిక అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. బాలికను రక్షించి రవిశేఖర్ ను బాలానగర్ పోలీసులకు అప్పగించారు. బాలానగర్​ ఎస్ఐ వెంకటేశ్వర్లు నిందితుడిపై పోక్సో యాక్ట్​కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప్టటారు.  కేసు దర్యాప్తులో పోలీసులు చార్జిషీట్ ఫైల్​ చేశారు.  సోమవారం ఎల్బీనగర్​ఫాస్ట్​ ట్రాక్​ కోర్డు జడ్జిఎన్. రఘునాథ్​రెడ్డి నిందితుడు రవిశేఖర్​కు మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 వేలు ఫైన్ విధిస్తూ తీర్పు వెల్లడించారు. కేసు దర్యాప్తులో నిందితుడికి శిక్ష పడేలా చేసిన సిబ్బందిని సజ్జనార్​ అభినందించారు.