కిడ్నాపైన నా భార్యను రక్షించకపోతే  .. పీఎస్​ ముందు సూసైడ్​ చేసుకుంట

కిడ్నాపైన నా భార్యను రక్షించకపోతే  .. పీఎస్​ ముందు సూసైడ్​ చేసుకుంట
  • మాక్లూర్ ​ఎంపీటీసీ భర్త హెచ్చరిక 
  • అవిశ్వాస తీర్మానం కోసమే అపహరించారని ఆరోపణ 

మాక్లూర్, వెలుగు : తన భార్యను కిడ్నాప్ ​చేసి పది రోజులవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, వెంటనే ఆమెను రక్షించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని నిజామాబాద్ ​జిల్లా మాక్లూర్​ఎంపీటీసీ-–2 మీరాబాయి భర్త నారాయణ హెచ్చరించారు. సోమవారం ఆయన మాక్లూర్ పీఎస్​కు వచ్చి తన భార్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందని పోలీసులను ప్రశ్నించారు. వారి నుంచి స్పందన లేదంటూ ఆరోపించారు.

మాక్లూర్ ఎంపీపీ మాస్త ప్రభాకర్, మాక్లూర్ సొసైటీ చైర్​పర్సన్​కొడుకు గోపు రంజిత్, సుక్కి సుధాకర్, బాక శ్రీను ఈ నెల 10న సాయంత్రం 7 గంటలకు తాను ఇంట్లో లేని టైంలో వచ్చి తన భార్య మీరాబాయిని కిడ్నాప్​ చేశారని, దీనిపై ఎంత మంది పోలీసు ఉన్నతాధికారులకు కంప్లయింట్​చేసినా ఆచూకీ కనుక్కోవడం లేదన్నారు. తన భార్యను రక్షించకపోతే పోలీస్​స్టేషన్​ ముందే సూసైడ్​ చేసుకుంటానని హెచ్చరించారు. ఈ కేసు విషయమై ఎస్ఐ సుధీర్​రావును వివరణ కోరగా పై అధికారులు విచారిస్తున్నారని, తాను ఎలాంటి వివరాలు చెప్పలేనన్నారు. మీరాబాయి కొడుకు సురేశ్, కోడలు లలిత, కూతురు చంద్రకళ, మదన్​పల్లి ఎంపీటీసీ గోవూరు ఒడ్డెన్న ఉన్నారు.