
ఓటీటీ ప్రేక్షకులు గత నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్ 3’. ఇప్పటికే వచ్చిన రెండు సీజన్స్ సూపర్ సక్సెస్ కావడంతో మూడో భాగంపై అంచనాలు ఏర్పడ్డాయి. గురువారం థర్డ్ పార్ట్ ట్రైలర్ను విడుదల చేశారు. సెకెండ్ పార్ట్ ఎండింగ్లో మున్నా భయ్యా (దివ్యేందు శర్మ) ను గుడ్డు పండిట్ (అలీ ఫజల్) అంతం చేస్తాడు. ఆ దాడి నుంచి తప్పించుకున్న కాలీన్ భయ్యా తీవ్ర గాయాలతో అక్కడి నుంచి పారిపోతాడు.
దీంతో ‘మీర్జాపూర్’ సింహాసనాన్ని గుడ్డు చేజిక్కించుకుంటాడు. ఇప్పుడు మూడో సీజన్లో అధికారాన్ని కాపాడుకునేందుకు అతను ఏం చేశాడు, అందుకోసం లోకల్ గ్యాంగ్స్తో ఎలా తలపడ్డాడు, తిరిగొచ్చిన కాలీన్ భయ్యాతో శత్రుత్వం ఇందులోని మెయిన్ కంటెంట్ అని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. మొత్తానికి సింహాసనం కోసం జరిగే యుద్ధం ఎలా ఉండబోతోందో ఇందులో చూపించారు. గత రెండు సీజన్స్ తరహాలోనే ఇందులోనూ యాక్షన్ డోసు ఎక్కువగా కనిపిస్తోంది. పంకజ్ త్రిపాఠి, హర్షిత గౌర్, విజయ్ వర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ కలిసి డైరెక్ట్ చేస్తున్నారు. జులై 5 నుంచి ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కానుంది.