
- పాతబస్తీని సందర్శించనున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్
- వెల్లడించిన ఐఅండ్పీ ఆర్ శాఖ స్పెషల్ కమిషనర్ వినయ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: మిస్ వరల్డ్-–2025 పోటీలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ టీ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 13న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పాత బస్తీని సందర్శించి, చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారని తెలిపారు. బుధవారం ఓల్డ్ సిటీలోని చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్ను పర్యాటక శాఖ డైరెక్టర్ జెడ్ హనుమంత్ కొండిబా, సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రతో కలసి సందర్శించారు. ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘మే 10 నుంచి 31వ తేదీ వరకు మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి.
చార్మినార్ వద్ద వాక్తోపాటు లాడ్ బజార్, చౌమహల్ల ప్యాలెస్ ను మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 116 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పోటీదారులతోపాటు దేశ విదేశాల నుంచి ఈవెంట్ కవరేజ్కు దాదాపు 3 వేల మంది మీడియా ప్రతినిధులు హాజరవుతారు. అలాగే వివిధ దేశాల నుంచి పోటీలకు వచ్చే వారిని తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలతో స్వాగతించాలని, పోటీలు పూర్తయ్యేంత వరకు ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటరమణ, పర్యాటక శాఖ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.