
ఎల్లారెడ్డిపేట, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో బాలుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది. బాలుడిని నానమ్మే తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సీఐ శ్రీనివాస్ గౌడ్ వివరాల ప్రకారం మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట ఏరియాలోని ఓ స్కూల్లో మహమ్మద్ తాజుద్దీన్ (8) 3వ తరగతి చదువుతున్నాడు. తాజుద్దీన్ తల్లిదండ్రులు 2001లో కరోనాతో చనిపోగా.. పెద్దమ్మ అతడిని సాకుతోంది. తాజుద్దీన్ను ఆమె సరిగా చూసుకోవడం లేదన్న అనుమానంతో నానమ్మ అబిదాబేగం అతడిని తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసింది.
సోమవారం స్కూల్కు వెళ్లివస్తున్న బాలుడిని ఆమె సోదరి తహెరా బేగంతో కలిసి ఆటోలో ఎక్కించుకొని సిద్దిపేటకు తీసుకెళ్లారు. బాలుడి పెద్దమ్మ జఖియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రెండు టీంలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు బాలుడిని సిద్దిపేటకు తీసుకెళ్లినట్లు గుర్తించి తీసుకొచ్చారు. అనంతరం బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో అప్పగించినట్లు సీఐ పేర్కొన్నారు. 24 గంటల్లో కేసును ఛేదించిన ఎస్ఐ రమాకాంత్, సిబ్బందిని సీఐ అభినందించారు.