- కేరళలోని పాలక్కడ్లో దారుణం
- బ్యూటీషియన్ మిస్సింగ్ కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
పాలక్కడ్: తనను నమ్మి వచ్చిన ఒక మహిళను దారుణంగా చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన కేరళలోని పాలక్కడ్లో చోటుచేసుకుంది. కొల్లాంలోని కొట్టాయంకు చెందిన 42 ఏళ్ల సుచిత్ర బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. ట్రైనింగ్ అని ఇంట్లో చెప్పి మార్చి 17 న బయటికి వెళ్లిన సుచిత్ర ఆ మరుసటి రోజు నుంచి ఆచూకీ లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాలక్కడ్లోని మనాలి వద్ద ఓ అద్దె ఇంట్లో హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించి కేసును ఛేదించారు.
తన భర్త నుంచి విడాకులు తీసుకున్న సుచిత్రకు.. అప్పటికే పెళ్లయి కొడుకు ఉన్న 32 ఏళ్ల ప్రశాంత్ అనే వ్యక్తి ఓ ఫంక్షన్లో పరిచయమయ్యాడని, వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్న విషయం దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. ప్రశాంత్ను కలవడానికే సుచిత్ర మనాలీ వెళ్లిందని తెలియడంతో కొట్టాయం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మనాలీ వెళ్లి ప్రశాంత్ను అదుపులోకి తీసుకొని విచారించారు. సుచిత్ర తనను ప్రేమిస్తోందని, కొంతకాలంగా పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో హత్య చేశానని నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. ఆమె బాడీని తాను ఉండే ఇంట్లోనే పాతి పెట్టినట్లు వెల్లడించగా పోలీసుల డెడ్బాడీని వెలికి తీశారు. దీంతో ప్రశాంత్ను అరెస్టు చేసి పోలీసులు కేసు నమోదు చేశారు.