- ప్రజాపాలన అప్లికేషన్ల ఆన్లైన్ ఎంట్రీలో పొరపాట్లు
- అర్హత ఉన్నా అందని జీరో బిల్లులు
- ప్రజాపాలన సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు
- ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో తామేమీ చేయలేమంటున్న ఆఫీసర్లు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ఆన్లైన్ ఎంట్రీలో జరిగిన పొరపాట్ల కారణంగా వందలాది మంది ఈ నెలలో గృహజ్యోతి స్కీమ్కు దూరం అయ్యారు. అన్నీ అర్హతలు ఉన్నప్పటికీ జీరో కరెంట్ బిల్లుకు బదులు వందల రూపాయల బిల్లులు చేతికి అందడంతో అయోమయానికి గురయ్యారు. ఇదేంటని విద్యుత్ సిబ్బందిని ప్రశ్నిస్తే మరోసారి అప్లై చేసుకోవాలని సమాధానం ఇస్తున్నారు. దీంతో ప్రజలు జీరాక్స్ పేపర్లతో ప్రజాపాలన సేవా కేంద్రాలకు పరగులు పెడుతున్నారు. కానీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో తామేమీ చేయలేమని ఆపరేటర్లు చేతులెత్తేస్తున్నారు.
81.54 లక్షల గృహజ్యోతి అప్లికేషన్లు
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,623 మున్సిపల్ వార్డుల్లో గ్రామసభలు నిర్వహించి అభయహస్తం పేరిట అర్హులైన వారి నుంచి అప్లికేషన్లు తీసుకుంది. దీంతో మొత్తం 1,25,84,383 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో గృహజ్యోతి స్కీం కింద 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ కోసం 81,54,158 మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన అప్లికేషన్లను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎంటర్ చేశారు.
స్కీమ్కు దూరమైన అర్హులు
ఈ నెల 1వ తేదీ నుంచి విద్యుత్ సిబ్బంది కరెంట్ బిల్లులు జారీ చేస్తున్నారు. అయితే గృహజ్యోతి స్కీమ్కు అప్లై చేసుకున్న చాలా మంది 200 యూనిట్లలోపే కరెంట్ వాడుకున్నప్పటికీ జీరో బిల్లులు మాత్రం రావడం లేదు. జీరో బిల్లు అని చెప్పి వందల రూపాయల బిల్లు చేతిలో పెట్టడంతో అయోమయానికి గురయ్యారు. చిన్న గ్రామాల్లో ఇప్పటికే బిల్లుల జారీ పూర్తి కాగా, మున్సిపాలిటీల్లో 30 నుంచి 50 శాతం కంప్లీట్ అయింది. ఇందులో 25 నుంచి 30 శాతం మంది ఫ్రీ కరెంట్కు అర్హులైనప్పటికీ జీరో బిల్లుకు దూరం అయ్యారు. దీంతో తాము అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ ఎందుకు జీరో బిల్లులు ఇవ్వట్లేదని విద్యుత్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 8,600 డొమెస్టిక్ మీటర్లు ఉన్నాయి. గృహజ్యోతి స్కీం కోసం 8 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అయితే ఇక్కడ 4,032 మంది మాత్రమే జీరో బిల్లుకు ఎంపికయ్యారు. దీంతో విద్యుత్ సిబ్బంది లబ్ధిదారుల ఇండ్లకు మాత్రమే వెళ్లి బిల్లులు కొడుతున్నారు. మిగతా వాళ్ల ఇండ్లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
ఆన్లైన్ ఎంట్రీలో తప్పులు
గ్రామాలు, మున్సిపాలిటీల్లో తీసుకున్న ప్రజాపాలన అప్లికేషన్లను ప్రైవేట్ ఆపరేటర్ల సహకారంతో ఆన్లైన్ చేశారు. ఇందులో చాలా మందికి సరైన అనుభవం లేకపోవడంతో దరఖాస్తుదారుల పేర్లు, మీటర్, తెల్లరేషన్కార్డు, ఆధార్ నంబర్లను తప్పుగా నమోదు చేశారు. అలాగే ఒక్కో గ్రామంలో, ఒక్కో వీధిలో ఒక్కో విధంగా ప్రజాపాలన అప్లికేషన్ నంబర్లు ఇచ్చారు. ఈ అప్లికేషన్లు నేరుగా విద్యుత్ సంస్థల చేతికి వెళ్లడంతో వారు కూడా తప్పులు సరిచేయకుండానే ఓకే చేసేశారు. దీంతో చాలా మంది అర్హులైన వారు కూడా గృహజ్యోతి స్కీమ్కు దూరం అయ్యారు.
ఎడిట్ ఆప్షన్ లేక ఇబ్బందులు
ప్రజాపాలన అప్లికేషన్లకు సంబంధించి ప్రతీ మండలం, మున్సిపాలిటీలలో ప్రభుత్వం సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మండలంలో అయితే ఎంపీడీవో ఆఫీసుల్లో, మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ ఆఫీసుల్లో ఈ సెంటర్లను ఓపెన్ చేశారు. ఒక్కో ఆఫీస్లో ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే అప్లై చేసుకున్నప్పటికీ చాలా మందికి జీరో బిల్లు రాకపోవడంతో వారం రోజులుగా వేలాది మంది ఈ సెంటర్లకు వస్తున్నారు. కానీ సెంటర్లను ఏర్పాటు చేసిన ఆఫీసర్లు ప్రజపాలన అప్లికేషన్ వివరాలను ఎడిట్ చేసే ఆప్షన్ ఇవ్వలేదు. ఒకవేళ కొత్తగా అప్లికేషన్ ఎంటర్ చేయడానికి ప్రయత్నిస్తే ఆధార్, రేషన్ కార్డ్, మొబైల్ నంబర్ ఆధారంగా గతంలోనే ఎంటర్ చేసినట్లు చూపుతోంది. దీంతో ఎడిట్ ఆప్షన్ వచ్చే వరకు తామేమీ చేయలేమని ఆఫీసర్లు చేతులెత్తేస్తున్నారు.
ఈమె పేరు అజ్మీరా రాధ. భూపాలపల్లి జిల్లా మహాముత్తారానికి చెందిన ఈమె ఫ్యామిలీకి తెల్ల రేషన్ కార్డు ఉంది. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో గృహజ్యోతి స్కీం కోసం అప్లై చేసుకుంది. గత నెల 50 యూనిట్ల కరెంట్ మాత్రమే వాడుకున్నారు. అయినా జీరో కాకుండా రూ. 201 బిల్ వచ్చింది. ఇదేంటని సిబ్బందిని అడిగితే మళ్లీ అప్లై చేసుకోవాలంటున్నారు.
ఈమె పేరు జరీనా. హనుమకొండ జిల్లా శాయంపేట. భర్త చనిపోవడంతో ఇద్దరు అమ్మాయిల బాధ్యతను తానే చూసుకుంటోంది. తెల్ల రేషన్ కార్డు ఉండడంతో గృహజ్యోతి స్కీంకు అప్లై చేసుకుంది. ఈ నెల 4న విద్యుత్ సిబ్బంది వచ్చి 25 యూనిట్లు కరెంట్ వాడుకున్నారంటూ రూ.110 బిల్లు వేశారు. జీరో బిల్లు రాకపోవడంతో ఈమె మళ్లీ శాయంపేట ఎంపీడీవో ఆఫీస్లోని ప్రజాపాలన సేవా కేంద్రకు వెళ్లగా ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదని ఆపరేటర్ సమాధానం ఇచ్చారు.