
మియాపూర్, వెలుగు: పనిచేస్తున్న ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ మైత్రి నగర్ ఫేస్ 2లోని ఓ అపార్ట్మెంట్లో ఐటీ ఉద్యోగి కృష్ణ కార్తీక్ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరి ఇంట్లో అల్విన్ కాలనీకి చెందిన లక్ష్మి గత పదేండ్లుగా హౌస్ మేడ్గా పనిచేస్తుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలో ఉన్న 90 గ్రాముల బంగారం, 77 గ్రాముల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లింది.
ఆ తర్వాత వాటిని నారాయణఖేడ్ లోని ఓ జువెలరీ షాప్ లో అమ్మేందుకు ప్రయత్నించగా, షాప్ యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఆమెను వారు అదుపులోకి తీసుకొని, మియాపూర్ పోలీసులకు అప్పగించారు. అనంతరం బాధితుడు కార్తీక్ ఫిర్యాదుతో లక్ష్మిని అరెస్ట్ చేశారు.