- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: జర్నలిస్టుల అక్రిడిటేషన్ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 252ను సవరించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే హెచ్143 చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఉమ్మడి మెదక్ జిల్లా టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి యాదగిరిగౌడ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి శుక్రవారం పటాన్చెరు క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గతంలో ఉన్న 239 జీవో ఆధారంగా 23 వేల కార్డులు రాగా నూతనంగా తీసుకొచ్చిన జీవోతో 13 వేల కార్డులు తగ్గనున్నాయని వివరించారు.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ అంశంపై శాసనసభలో చర్చించి ప్రభుత్వానికి సూచనలు చేసి జీవోను సవరించేల జర్నలిస్టులకు మద్దతుగా నిలవాలని జర్నలిస్టు నాయకులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే జర్నలిస్టులకు న్యాయం జరిగేలా ప్రభుత్వానికి విషయాన్ని వివరిస్తానని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే హెచ్143 జిల్లా ఉపాధ్యక్షులు రాఘవరెడ్డి, నారాయణ, జింకల శ్రీనివాస్, కిశోర్, ప్రేమ్కుమార్, మన్నె కుమార్, అంజయ్ పాల్గొన్నారు.
