పటాన్చెరులో ఏసీపీ ఆఫీస్ ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

పటాన్చెరులో ఏసీపీ ఆఫీస్ ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

అమీన్​పూర్(పటాన్​చెరు), వెలుగు: శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్​చెరు పట్టణ కేంద్రంలో ఏసీపీ ఆఫీస్​ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్​లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ శివధర్​రెడ్డికి వినతిపత్రం అందించారు. పటాన్​చెరు కేంద్రంగా ఉండాల్సిన ఏసీపీ ఆఫీస్​ ను ఆర్​సీపూర్ ​పేరుతో రామచంద్రాపురం​ కేంద్రంగా ఏర్పాటు చేశారన్నారు. 

దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. పటాన్​చెరులో జాతీయ రహదారికి ఆనుకొని  ఇటీవల 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డీఎస్పీ భవనానికి శంకుస్థాపన చేశామని, ఆ బిల్డింగ్​లో ఏసీపీ కార్యాలయం ఏర్పాటు చేయాలని విన్నవించారు. కొల్లూరు పోలీస్​ స్టేషన్​ను రామచంద్రాపురం ఏసీపీ పరిధిలోకి చేర్చాలన్నారు. బొల్లారం ఠాణాను యధావిధిగా కొనసాగించాలని, పటాన్​చెరు కేంద్రంగా కొత్త ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ను ఏర్పాటు చేయాలని కోరగా.. డీజీపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు.  

జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే..

పటాన్​చెరు కేంద్రంగానే జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని కొనసాగించాలని ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి కోరారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్​ఆర్వీ.కర్ణన్​కు వినతిపత్రం అందజేశారు. పటాన్​చెరు కేంద్రంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఇటీవల పరిపాలన సౌలభ్యం పేరుతో తెల్లాపూర్ మున్సిపల్​కార్యాలయంలోకి మార్చారన్నారు. దీనివల్ల పాలనాపరంగా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు. స్పందించిన కమిషనర్ పటాన్​చెరు కేంద్రంగానే సర్కిల్ కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.