
- మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభం
ములకలపల్లి, వెలుగు : యువత విద్య, క్రీడా రంగాల్లో రాణించాలంటే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ఆదివారం మండలంలోని రింగిరెడ్డిపల్లిలో గ్యాంగ్ వార్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. క్రీడల ద్వారా స్నేహ సంబంధాలు పెంపొందించడంతోపాటు క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
గ్రామీణ ప్రాంత యువతీయువకులు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రాణించాలని సూచించారు. అనంతరం చౌటిగూడెంలో జరుగుతున్న అంకమ్మ తల్లి జాతరకు ఆయన హాజరయ్యారు. వెల్కమ్ వారిగుంపు, ములకలపల్లి గ్రామాల్లో జరుగుతున్న బ్రిడ్జి,సెంట్రల్ లైటింగ్ రోడ్డు పనులను పరిశీలించారు. వికే రామవరంలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన బాలుడు కొరస అరవింద్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబాన్ని ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, మాజీ సర్పంచులు కారం సుధీర్, సున్నం సుధాకర్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పాలకుర్తి సుమిత్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొడిమే వంశీ తదితరులు పాల్గొన్నారు.