
హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే రఘునందన్రావు
హైదరాబాద్, వెలుగు: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలప్పుడు తనపై సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని బీజేపీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్రావు హైకోర్టును ఆశ్రయించారు. ఉప ఎన్నికలప్పుడు అంజన్రావు ఇంట్లో రూ.18.67 లక్షలు లభించాయని చెబుతున్న పోలీసులు.. ఆ నగదు సంచిని కొందరు పోలీసులు, ఎమ్మార్వోలపై దాడి చేసి కాజేసేందుకు తాను ప్రోత్సహించినట్లు తప్పుడు కేసు పెట్టారని రిట్లో పేర్కొన్నారు. ఆ రిట్ పిటిషన్ను జస్టిస్ పి. లక్ష్మణ్ గురువారం విచారించారు. తనపై తప్పుడు కేసు బనాయించారని, ఇందులో సాక్షులంతా ప్రభుత్వాధికారులేనని, ప్రభుత్వమే కావాలని కేసు పెట్టించిందని రిట్లో పేర్కొన్నారు. చట్టసభ సభ్యులపై నమోదైన కేసులను చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ జరుపుతోందని, కేసును సీజేకు నివేదించాలని హైకోర్టు రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. అక్టోబర్ 26న రఘునందన్రావు బంధువు అంజన్రావు ఇంట్లో తనిఖీలు చేసి రూ.18.67 లక్షలు లభించినట్లు ప్రకటించారు. ఆ డబ్బులు పోలీసులే తీసుకొచ్చి పెట్టి.. దొరికాయని చెప్పారని బీజేపీ శ్రేణులు ఆరోపించిన విషయం తెలిసిందే.
For More News..