మాస్టర్ ప్లాన్పై అపోహలొద్దు:ఎమ్మెల్యే సంజయ్

మాస్టర్ ప్లాన్పై అపోహలొద్దు:ఎమ్మెల్యే సంజయ్

మాస్టర్ ప్లాన్ పై కొందరు నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపించారు. తమ రాజకీయ ఉనికి కోసం ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. టౌన్ ప్లాన్ మార్పు కోసం మళ్లీ రీ ప్రతిపాదన చేస్తున్నామని చెప్పారు. జగిత్యాల చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు, రైతులందరీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తామని తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్ ను తాము తయారు చేసింది కాదని.. 2014 లోనే  కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం వచ్చిందని స్పష్టం చేశారు. రైతులకు ఒక్క ఎకరం భూమి కోల్పోకుండా అన్నదాతలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

గత మూడురోజుల క్రితం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సంజయ్ కుమార్ మాస్టర్ ప్లాన్ పై రైతులకు భరోసా ఇచ్చారు. రైతులకు ఇబ్బంది కలుగుతుందంటే తాను వ్యతిరేకమని చెప్పారు.1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగిత్యాలలోని విజయపురికాలనీలో చాలావరకు అక్రమంగా ఇండ్లు కట్టారని, ఆ సమయంలో ఆ ప్రాంతం ఇండస్ట్రియల్ కింద ఉండేదన్నారు. అక్రమ లే అవుట్లకు కాంగ్రెస్ వాళ్లే పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు. అభివృద్ధి కోసమే లింగం పేట్, నర్సింగాపూర్ తో పాటు మరికొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో కలిపామని చెప్పారు.

మాస్టర్ ప్లాన్ పై ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నపుడు మాస్టర్ ప్లాన్ లేదా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే జగిత్యాల పట్టణాన్ని నాశనం చేశారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే వారు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.