
- మాల, మాదిగల మధ్య గొడవలు పెట్టాలని చూస్తుండ్రు
- ఇప్పటివరకు 100 అంబేద్కర్ విగ్రహాలకు సాయం చేశా
- ఎక్కడ విగ్రహం పెట్టాలన్న రూ. 50 వేలు ఇస్త
- కుట్రతోనే ఎస్సీ వర్గకరణ రిజర్వేషన్లు
- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
జగిత్యాల: మాలలకు మంచి పోస్టులు ఇవ్వాలంటే భయపడుతున్నారని, మాల, మాదిగల మధ్య గొడవలు పెట్టి వాళ్లు ముందుకు పోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మాలల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన చీప్గెస్ట్గా హాజరై మాట్లాడారు. ఇప్పటివరకు 100 అంబేద్కర్ విగ్రహాలకు సాయం చేశామన్నారు. ఎక్కడ విగ్రహం పెట్టాలన్న రూ. 50 వేలు ఇస్తామని చెప్పారు. ‘అంబేద్కర్స్ఫూర్తితో ఎన్ని ఒత్తిళ్లు వచ్చిన జాతి కోసం పోరాటం చేస్త.
ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా నన్ను అణిచివేయాలని చూశారు. ఆయన పైనా పోరాటం చేశాను. మాలల పైన కుట్రతోనే ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ చేశారు. రిజర్వేషన్స్ పెంచకుండా ఎస్సీ వర్గీకరణ చేయడం అన్యాయం. తమిళనాడు తరహాలో ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచాలి. మాలలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని నిరూపించేందుకు హైదరాబాదులో డిసెంబర్ లో భారీ సభ నిర్వహించి మన సత్తా చూపించాం.
కులానికి సంబంధించి ఇంత పెద్ద సభ జరగడం దేశంలోనే మొదటిసారి అని నాతో ఓ పెద్దమనిషి అన్నాడు. ఆ సభ సక్సెస్ కాకపోతే నా రాజకీయ జీవితం ముగిసిపోయేది. మన జాతి ఐక్యతను నిరూపించుకున్నాం. కాళేశ్వరంలో వంశీకృష్ణకు ప్రొటో కాల్ ఇవ్వలేదు. మన సత్తా మనం చూపించుకోకపోతే ఇలాంటి అన్యాయాలే జరుగుతాయి. మనం ఒక తాటిపైకి వచ్చి మనజాతి కోసం పోరాడాలి. ’ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి అన్నారు.