ఇరిగేషన్ మంత్రిగా పనికిరావని ..మీ మామే నీకు సర్టిఫికెట్ ఇచ్చాడు : మంత్రి ఉత్తమ్

ఇరిగేషన్ మంత్రిగా పనికిరావని ..మీ మామే నీకు సర్టిఫికెట్ ఇచ్చాడు : మంత్రి ఉత్తమ్

మాజీ మంత్రి హరీష్ రావుపై  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.   ఇరిగేషన్ శాఖ మంత్రిగా నువ్వు పనికిరావని మీ మామే (కేసీఆర్) నిన్ను పదవి నుంచి తీసివేసి సర్టిఫికెట్ ఇచ్చాడు కదా' అంటూ ఎద్దేవా చేశారు. రూ. 38 కోట్లతో తమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేపట్టి కనీసం పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రూ. 20 కోట్లతో నిర్మిస్తున్న మోడల్ కాలనీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. బీఆర్ఎస్ నేతలపై, ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి ప్రధాన కారణం కేవలం బీఆర్ఎస్ పార్టీయేనని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఎక్కువ మొత్తం ఖర్చు పెడితే.. ఎక్కువ కమిషన్ వస్తుందనే దురాశతోనే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును తొలగించి కాళేశ్వరం అని పేరు మార్చారని ఆరోపించారు. కవిత ఆన్ రికార్డ్‌గా చెప్పిన 1400 కోట్ల కమిషన్ వ్యవహారాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

కనీసం మట్టి పరీక్షలు కూడా నిర్వహించకుండా, అధికారులు సూచించిన చోట కాకుండా ఐదు కిలోమీటర్ల దూరంలో, ఇసుకపై పునాది వేయడం వల్లే ప్రాజెక్టు కూలిపోతుందని సేఫ్టీ కంట్రోల్ ముందే హెచ్చరించినా బీఆర్ఎస్ వినలేదని ఉత్తమ్ మండిపడ్డారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ టీమ్ హెచ్చరించినా పట్టించుకోకుండా.. ఇప్పుడు కాంగ్రెస్‌పై నిందలు వేయడం సరికాదన్నారు.

డ్యామ్ సేఫ్టీ అధికారులు నీటిని నిల్వ చేయొద్దని చెబుతున్నా.. బీఆర్ఎస్ నేతలు ఇంకా మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటకు వస్తున్న నీళ్లు ఎస్సారెస్పీ స్టేజ్-2 ద్వారా వస్తున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా కాళేశ్వరం నీళ్లు వదల్లేదని స్పష్టం చేశారు. తెలంగాణను అప్పులమయం చేసిన బీఆర్ఎస్ తప్పులను సరిదిద్దుతూ.. డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచనల మేరకు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.