పటాన్చెరు నియోజవకర్గంలో 13 డివిజన్లు ఏర్పాటు చేయాలి..జీహెచ్ఎంసీ కమిషనర్ను కోరిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి

పటాన్చెరు నియోజవకర్గంలో 13 డివిజన్లు ఏర్పాటు చేయాలి..జీహెచ్ఎంసీ కమిషనర్ను కోరిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి

అమీన్​పూర్, వెలుగు: పటాన్​చెరు నియోజవకర్గంలో 13 డివిజన్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి జీహెచ్​ఎంసీ కమిషనర్​ఆర్వీ కర్ణన్​ను కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ డివిజన్ల విభజనపై పది అంశాలతో కూడిన వినతిపత్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, పటాన్​చెరు, అమీన్​పూర్​, బొల్లారం పట్టణ బీజేపీ నాయకులతో కలిసి కమిషనర్​కు అందజేశారు. 

అమీన్​ఫూర్​ మున్సిపాలిటీ పరిధిలో లక్షా ఇరవై వేల మంది ఓటర్లు ఉన్నారని, ఇక్కడ నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం అమీన్​పూర్, సుల్తాన్​పూర్​పేరుతో రెండు మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. అమీన్​పూర్​తో పాటు పటేల్​గూడ లేదా కిష్టారెడ్డిపేటను, బీరంగూడ, పీజేఆర్​ కాలనీ పేరుతో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాలన్నారు. సుల్తాన్​పూర్​ స్థానంలో కిష్టారెడ్డిపేట లేదా పటేల్​గూడను డివిజన్​గా ప్రకటించాలన్నారు. 

తెల్లాపూర్​ మున్సిపాలిటీ పరిధిలో నాలుగు డివిజన్లు చేయాలన్నారు. తెల్లాపూర్​తో పాటు ముత్తంగి పేరిట డివిజన్లు ఏర్పాటు చేశారని, ఇక్కడ లక్షా ఇరవై వేల మంది ఓటర్లు ఉంటారని, కొల్లూరు, ఈదులనాగులపల్లి డబుల్​ బెడ్​ రూమ్​లలో సుమారు నలభై వేల మంది ఓటర్లు ఉన్నారన్నారు. తెల్లాపూర్​, ముత్తంగితో పాటు కొల్లూరు, వెలిమెల పేరుతో మరో రెండు డివిజన్లు ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలన్నారు.

 పటాన్​చెరు డివిజన్​ పరిధిలో 80వేల పై చిలుకు ఓటర్లు ఉన్నారని, ఇక్కడ మూడు డివిజన్​లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండగా జేపీ కాలనీ పేరుతో ఒకే డివిజన్​ను ప్రకటించారన్నారు. ఆల్విన్​ కాలనీ పేరుతో మరో డివిజన్​ను విభజించాలన్నారు. పటాన్​చెరు నియోజకవర్గంలోని ఐడీఏ బొల్లారం డివిజన్​ను అమీన్​పూర్​, తెల్లాపూర్​ డివిజన్​లతో పాటే శేరిలింగంపల్లి జోన్​లో కలపాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్​రెడ్డి, బొల్లారం పట్టణ అధ్యక్షుడు ఆనంద్​ కృష్ణారెడ్డి, అమీన్​పూర్​ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు, నాయకులు సుధాకర్​ రెడ్డి పాల్గొన్నారు.