
- సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖలు చేయడంతో బల్మూరి ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గురువారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. బీఎన్ఎస్ 353(2), 352 సెక్షన్ల కింద కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్.. కమిషన్ ముందు విచారణకు హాజరైన సమయంలో సీఎం రేవంత్ ను కించపరిచేలా, ఆయన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బల్మూరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేటీఆర్ చేసిన నిరాధారమైన, పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలతో కూడిన వీడియో ఒకటి ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారం జరిగిందని సైబర్ క్రైం పోలీసులకు ఆయన వెల్లడించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజా శాంతికి భంగం కలిగించేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. వీటికి సంబంధించి సోషల్ మీడియా పోస్టులను కూడా ఆధారాలుగా సమర్పించారు.