
భద్రాచలం, వెలుగు : ‘భారత రాజ్యాంగం హైందవ ధర్మానికి దగ్గరగా ఉంటుంది, కానీ బీజేపీ దానిని మరో రకంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది.. రాముడి వద్దకు రావడం అంటే ప్రజాస్వామ్యం వద్దకు వచ్చినట్లే, రాముడిని దళితులకు దూరం చేస్తున్నారు’ అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. భద్రాచలంలో ఆదివారం జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. అంతకు ముందు కుటుంబ సమేతంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాముడు మూలవాసుల దేవుడేనన్నారు. ‘జై శ్రీరాం, జై సీతారాం’ అని కొన్ని పార్టీలు ఓన్ చేసుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.
తాను రామాలయంలో పూజలు చేశానంటే.. అది రాజ్యాంగం వల్లేనన్నారు. రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని చెప్పారు. బీసీల కోసం మొట్టమొదట పోరాడింది అంబేద్కరేనని చెప్పారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకులపాడు మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. 153 గ్రామాలను ఏపీలో కలపడం సరికాదని గతంలోనే తాను, కోదండరాం చెప్పామని గుర్తు చేశారు.