జగిత్యాల: భారీ వర్షాలతో దెబ్బతిన్న వరి, పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పంట నష్టాలపై రైతువారి సర్వే నిర్వహించాలన్నారు. శనివారం జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. వరదలతో హైదరాబాద్ మొత్తం నాశనమైనా.. ప్రగతి భవన్ నుంచి సీఎం బయటకు రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. రైతులను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత నిర్లిప్తత పనికి రాదని, సీఎం ఇప్పటికైనా కాలు బయటపెట్టాలన్నారు. నడవడం చేతకాకపోతే కనీసం హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేయాలని అన్నారు.
రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల పంటల బీమా పథకం నిర్వీరమై పోయిందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లాగా తయారయ్యాయని అన్నారు. వర్షాలకు తడిచి రంగు మారిన వడ్లను కూడా సర్కారు కొనుగోలు చేయాలని, మొక్కజొన్నలకు వెయ్యికి మించి ధర రావడం లేదు.మార్కెఫెడ్ ద్వారా కనీస మద్ధతు ధరతో మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.