సెక్రటేరియట్ కు పెట్టే ఖర్చుతో ఆర్టీసీని బాగుచేయొచ్చు

సెక్రటేరియట్ కు పెట్టే ఖర్చుతో ఆర్టీసీని బాగుచేయొచ్చు

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని కూడా నియమించలేదని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న ఆయన…సెక్రటేరియట్ కు పెట్టే ఖర్చుతో ఆర్టీసీ కార్మికుల సమస్యలను తీర్చవచ్చన్నారు. అంతే కాదు గత ఎన్నికల సమయంలో ప్రైవేటు వాహనాలను తగ్గిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని… కానీ ఈ ఐదేళ్లలో ప్రైవేటు వాహనాల సంఖ్య మరో 5 శాతం పెరిగిందన్నారు. ఆర్టీసీ నష్టాల ఊబిలోకి జారుకోవడానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని తెలిపారు జీవన్ రెడ్డి. వేతన సవరణ కాలపరిమితి ముగిసి 30 నెలలు గడిచినప్పటికీ ఇంత వరకు అమలు చేయలేదని విమర్శించారు. ప్రగతి భవన్ లో మీరు దసరా పండుగ చేసుకుంటారు… ఆర్టీసీ కార్మికులు జరుపుకోవద్దా? అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ప్రశ్నించారు.

ఆర్టీసీలో 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్న జీవన్ రెడ్డి… ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఏ రోజు సెక్రటేరియట్ కు రారని… కొత్త సచివాలయ నిర్మాణం అవసరం లేదన్నారు జీవన్ రెడ్డి.