
జాతీయ స్థాయిలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ చేస్తున్న మత విద్వేషాలను.. నిర్మూలించేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నిరుపేదలకు ఉపాధి, ఉద్యోగ కల్పన లేదని విమర్శించారు. ఉపాధి హామీ పథకం కూడా నిర్వీర్యం చేసే విధంగా నిధుల కోత విధిస్తోందని కేంద్రంపై మండిపడ్డారు. అదాని అంబానీ లాంటి వ్యాపారస్తులకు NPA కింద లక్షల కోట్లు రుణ మాఫీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం తీరుతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వంపైనా జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు చూపిస్తే.. తాను కేసీఆర్కు పాలాభిషేకం చేస్తానన్నారు. కాంగ్రెస్ హయాంలో మిల్లర్ల కోతలు లేవని.. ఇప్పుడు సబ్సిడీలు కూడా ఎత్తేసి రైతుబంధుతో రైతులను మోసం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ధరణి పోర్టల్ ద్వారా రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేశారని చెప్పారు. మునుగోడులో మద్యం ఎరులై పారుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.