
ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘‘పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నది. కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు’’ అని ఆదేశాల్లో తెలిపారు.
అమెరికా నుంచి వచ్చిన కవిత హరీశ్రావు, సంతోష్ రావు పేర్లను తీసుకొని, నేరుగా ఎటాక్ చేశారు. అవినీతి అనకొండలంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో కవితపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. వాస్తవానికి ఆమె చేసిన వ్యాఖ్యలకు షోకాజ్ నోటీసు ఇస్తారని పార్టీ వర్గాలు భావించాయి. కానీ, నేరుగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో జాగృతి నేతలు షాక్ అయ్యారు. కనీసం షోకాజ్ ఇవ్వకుండా పార్టీ నుంచి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ఇటు కవిత తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో కవిత సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేశారు. తెలంగాణ జాగృతిని బలోపేతం చేసుకుంటూ 30 అనుబంధ విభాగాలు ఏర్పాటు చేశారు. సింగరేణి జాగృతి విభాగాన్ని ప్రకటించారు. అయితే, ఈ క్రమంలోనే సింగరేణి ఇన్చార్జ్గా కొప్పుల ఈశ్వర్ను జులై 16న కేటీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో సింగరేణిలో ఆమె హిందూ మజ్దూర్ సభతో జట్టుకట్టారు. దీంతో ఆగస్టు 21ను ఆమెను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా తప్పించారు.
ఆమె స్థానంలో కొప్పుల ఈశ్వర్ను నియమించారు. జూన్ 1న జాగృతికి అనుబంధంగా యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (యూపీఎఫ్) పనిచేస్తుందని కవిత ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీ తరఫున కాకుండా యూపీఎఫ్ ద్వారానే బీసీ రిజర్వేషన్లపై ఆమె స్పందిస్తూ వస్తున్నారు. ఆగస్టు 3న బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిపై ఆమె మండిపడ్డారు. లిల్లీపుట్అని వ్యాఖ్యా నించారు. ఆ తర్వాత రాఖీ పండుగ రోజు తన అన్న కేటీఆర్కు రాఖీ కడతానంటూ కవిత మెసేజ్ పెట్టారు. ఆగస్టు 9న మెసేజ్ పెట్టినా.. కేటీఆర్ నుంచి స్పందన రాలేదు. ఆ తర్వాత కేటీఆర్ బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి కవితకు రిప్లై ఇచ్చారన్న విమర్శలున్నాయి. దీంతోనే అన్నా చెల్లెళ్ల మధ్య దూరం పెరిగిందన్న చర్చ కూడా జరిగింది.