
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. "తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు” అంటూ కవిత ట్వీట్ చేశారు. వైఎస్సాఆర్టీపీ, బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని, షర్మిల వెనుక బీజేపీ ఉందని అర్థం వచ్చేలా ఆమె ట్వీట్ చేశారు.
నర్సంపేటలో టీఆర్ఎస్ లీడర్ల దాడి, పోలీసుల తీరుకు నిరసనగా నిన్న షర్మిల చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్ లీడర్లు ధ్వంసం చేసిన కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కారులోంచి దిగకపోవడంతో టోయింగ్ వెహికల్ తీసుకువచ్చి కారును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లారు. స్టేషన్లో బలవంతంగా కారు డోర్లు ఓపెన్ చేసి.. షర్మిల, ఆమె అనుచరులను అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి బెయిల్ మంజూరు చేశారు. అయితే షర్మిల ఆరెస్ట్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ప్రతిపక్షాల గొంతునొక్కడమే ప్రధాన అజెండాగా టీఆర్ఎస్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.