- కాంగ్రెస్ నేతలు సిద్ధం.. సీఎంను ఒప్పిస్తా..
- కౌన్సిల్లో ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ సవాల్
- మూసీని సుందరీకరించకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయని కామెంట్
- ఊహల్లో గవర్నర్ ప్రసంగం: మధుసూదనాచారి
- ప్రజాపాలనకు ప్రతిబింబం: అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్షనేత కేసీఆర్, కేటీఆర్తో సహా అందరూ డ్రగ్స్ టెస్ట్కు రావాలని ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ సవాల్ చేశారు. ప్రజాప్రతినిధులంతా డ్రగ్స్టెస్ట్కు ముందుకొచ్చి ఆదర్శంగా నిలవాలని సూచించారు. మంగళవారం శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మహేశ్కుమార్గౌడ్మాట్లాడారు.‘‘డ్రగ్ టెస్టులకు కాంగ్రెస్ నాయకులంతా సిద్ధం.. సభ్యులంతా డ్రగ్ టెస్టు చేయించుకోవాలి’’ అని అన్నారు.
గతంలో కొందరు నాయకులు డ్రగ్స్ దందాల్లో పాల్గొన్నారని, వారిని వదలబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో కొకైన్ డ్రగ్స్ పట్టుబడినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. మూసీని సుందరీకరించి .. గోదావరి జలాలను తరలించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, మూసీ కాలుష్యాన్ని తగ్గించకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు.
పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ వరంగల్, ఆదిలాబాద్లో విమానాశ్రయాల నిర్మాణం చేపడతామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు. మేడారం అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించామని, బాసర, వేములవాడ నుంచి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 5 గ్యారెంటీలను అమలు చేశామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తే తమ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు.
గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధం: మధుసూదనాచారి
గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా .. ఉహల్లో ఉందని బీఆర్ఎస్ పక్షనేత మధుసూదనాచారి విమర్శించారు. మాటల గారడీ తప్ప ఆచరణలో చిత్తశుద్ధి లేదన్నారు. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో రాష్ట్ర పాలన సాగుతున్నదని చెప్పారు. రైతు భరోసా, మహాలక్ష్మి కింద సాయం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నా.. ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు చేసినా.. తప్పులు చేయలేదని, అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు.
ఓయూకు వెయ్యి కోట్లు కేటాయించినం: అద్దంకి
గవర్నర్ ప్రసంగం ప్రజాపాలనకు నిలువుటద్దంగా ఉందని కాంగ్రెస్ సభ్యుడు అద్దంకి దయాకర్ ప్రశంసించారు. రైతు భరోసాకు రూ.19 వేల కోట్లు, ఉస్మానియా వర్సిటీకి రూ.వెయ్యి కోట్లు కేటాయించామని తెలిపారు. 1969, 1996, 2001 తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల గుర్తింపు కమిటీ ఏర్పాటు చేశామన్నారు.
