సర్కారు కాలేజీలను రక్షించుకోవాల్సిన బాధ్యత లెక్చరర్లదే
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని సర్కారు కాలేజీలను కాపాడుకోవాల్సిన బాధ్యత లెక్చరర్లదే అని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. కాలేజీల వెన్నెముక లెక్చరర్లు అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని టీఎస్యూటీఎఫ్ ఆఫీసులో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేఎల్ఏ– 475) ఆవిర్భావ సభ నిర్వహించారు. జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులరైజ్ కావడంతో కాంట్రాక్టు లెక్చరర్ల సంఘాన్ని టీజీజేఎల్ఏగా మార్చుతూ కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్చేశారన్నారు.
విశిష్ట అతిథిగా హాజరైన ప్రభుత్వ మాజీ చీఫ్విప్ పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ...అనేక పోరాటాలు చేసి రెగ్యులరైజేషన్ సాధించామన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ మాట్లాడుతూ.. 2004లో కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం ఏర్పాటు చేసి అనేక పోరాటాలు చేశామన్నారు. సభలో విద్యావేత్త అందె సత్యం, టిగ్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణగౌడ్, ఇంటర్ విద్యాఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు మాట్లాడారు.