
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులంతా కృషి చేయాలని, వారికి అన్ని విధాల సహకారం అందిస్తామని టీచర్స్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే పీఆర్టీయూ కార్యకర్తలతో ఈ విషయమై తాను ఫోన్ ద్వారా మాట్లాడానని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన చెప్పారు. నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొస్తున్న మార్పులను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలని టీచర్లను కోరారు.
ప్రైవేటు విద్య కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక వికాసంతో కూడిన విద్యను అందిస్తున్న విషయాన్ని గుర్తించాలని, దీనిపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. నేటి తరం విద్యా బోధనకు అనుగుణంగా టీచర్లలో బోధన పటిమ పెంచుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ప్రచార కార్యక్రమంలో తాను చురుకుగా పాల్గొంటానని, అందరిని సమ్మిళితం చేస్తానని శ్రీపాల్ రెడ్డి స్పష్టం చేశారు.