
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా మెరుగైన సేవలను అందించడానికి వీలు కల్పించింది. ప్రస్తుతం ఒక్క మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు ప్రపంచంలోని ఎక్కడినుంచైనా కావాల్సిన పనులను, అవసరాలను తీర్చుకొనే వ్యవస్థను ప్రభుత్వాలు కల్పించాయి. ఆపరేషన్ సిందూర్లో ప్రపంచం ఆశ్చర్యపోయేవిధంగా పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై గురిచూసి దాడిచేయడంలో డిజిటలైజేషన్ పాత్ర కీలకమైంది. 2027లో జరపబోయే జనగణనను కూడా ఒకటిన్నర శతాబ్దం తర్వాత మొదటిసారిగా డిజిటలైజేషన్ ద్వారా నిర్వహించబోతున్నారు.
ఆధునిక సమాజంలో ప్రజల కోరికలతోపాటు అవసరాలు కూడా పెరిగిపోతుండడంతో ప్రజా ప్రభుత్వాలు తనపాలనా ప్రవర్తనలో కూడా మార్పులను తెస్తున్నది. ఒకప్పటి పొలీసు రాజ్యాలు పరిమితమైన దేశరక్షణ, శాంతిభద్రతలు, న్యాయపరమైన విధులు కలిగి ఉండేవి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత స్వతంత్రం పొందిన దేశాలు సంక్షేమ రాజ్యాలుగా ఏర్పడ్డాయి.
1992లో ప్రపంచ బ్యాంకు అవినీతి రహిత, స్థిరమైన ప్రభుత్వపాలనను అందించే ప్రక్రియలో ప్రజాస్వామ్య విలువలు, పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యం, సమన్యాయం, జవాబుదారీతనాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వాలు పనిచేయడానికి సుపరిపాలనను సూచించింది. సుపరిపాలన ద్వారా ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ప్రజల హక్కులను కాపాడి అన్నివర్గాల అవసరాలను, ఆకాంక్షలను ప్రభుత్వ నిర్ణయాలలో ప్రతిబింభించేవిధంగా ఈ–గవర్నెన్స్ వ్యవస్థను
అందుబాటులోకి తెచ్చింది.
ఈ-గవర్నెన్స్
పారదర్శక పాలనను ప్రజలకు అందుబాటులోకి ఈ–పాలన ద్వారా అమలులోకి తెచ్చింది. అందుకే, 1990 ప్రారంభంలో డిజిటల్ టెక్నాలజీ అప్లికేషన్లను ప్రజాసేవలు. సమాచారవ్యాప్తి సాధనంగా ఉపయోగించారు. వీటికి చట్టబద్ధతను చేకూర్చేందుకు 2000లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని తీసుకువచ్చి ఇంటర్నెట్ ద్వారా ప్రజలకు నూతన సాంకేతిక ప్రచార సాధనాల ద్వారా పౌరసేవలందించేందుకు ఈ–గవర్నెన్స్ను ప్రోత్సహించింది.
నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (NIC)ను 1976లోనే స్థాపించినా 1992లో చట్టపరమైన అధికారాలు పొంది ఈ–-గవర్నెన్స్ అప్లికేషన్లకు ప్రధాన బిల్డర్గా సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి డిజిటల్ అవకాశాలను ప్రోత్సహిస్తోంది. అలాగే, 2006వ సంవత్సరంలో నేషనల్ ఈ–-గవర్నెన్స్ ప్రణాళికను ప్రకటించి ఇరవై ఏడు మిషన్ మోడ్ ప్రాజెక్ట్లు, ‘సాధారణ సేవా డెలివరీ అవుట్లెట్ల ద్వారా సామాన్యులకు అన్ని ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
ఈ ప్రాజెక్ట్లలో ఈ-–పాస్పోర్ట్, ఈ-–ల్యాండ్ రికార్డ్, ఈ-–డిస్ట్రిక్ట్ , ఈ-–కోర్టులు. ఈ-–ప్రొక్యూర్మెంట్ లాంటి అనేక సేవలను అందుబాటులోకి తెచ్చింది. దేశంలోని కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయి అన్ని ప్రభుత్వ వ్యవస్థల సమాచారాన్ని ప్రజలకు ప్రస్తుతం 6,700 వెబ్సైట్ల ద్వారా అందుబాటులోకి తెచ్చింది.
డిజిటల్ పాలన
20వ శతాబ్దం పారదర్శక పాలన కోసం డిజిటల్ టెక్నాలజీని స్వీకరించడం ద్వారా ప్రపంచానికి ఒక ముఖ్యమైన లక్షణాన్ని పరిచయం చేసింది. డిజిటలైజేషన్ను ‘ప్రజల స్నేహపూర్వకమైన’ సాధనం అని కూడా పిలుస్తారు. డిజిటలీకరణ అనేది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దూరాన్ని తగ్గించి ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే, బ్యూరోక్రాటిక్ జాప్యం(redtapism), అవినీతిని (corruption) తగ్గించి ప్రజలకు నాణ్యమైన సేవలను పారదర్శకంగా అందించగలదు.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం డిజిటల్ సాధికారిక సమాజంగా జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్పు తీసుకురావడమే లక్ష్యంగా డిజిటల్ ఇండియా విధానాన్ని జులై 1, 2015న ప్రకటించింది. ఈ విధానం ద్వారా MyGov ,ఈ-–హాస్పిటల్, డిజిలాకర్, జీవన్ ప్రమాణ్, ఆధార్-కార్డులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, ప్రభుత్వ ఈ-–మార్కెట్ప్లేస్, ఉమాంగ్ వంటి అనేక ఆన్ లైన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా పాలనా పారదర్శకతకు పబ్లిక్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ప్రభుత్వ ఖర్చులను ట్రాక్ చేయవచ్చు.
అలాగే, 2005లో తెచ్చిన సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ పనితీరును తెలుసుకొనే అవకాశం సామాన్య ప్రజలకు కల్పించింది. దీనికి తోడు కృత్రిమ మేధస్సు (AI)ను అందుబాటులోకి తెచ్చి సమస్యలను నివృత్తిచేసే ప్రక్రియను ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ప్రపంచంలోనే మనదేశం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన తరుణంలో, 2022–-23 నాటికి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ జీడీపీలో 11.74% వాటాను కలిగి ఉండగా 2030 నాటికి 20%కి పెరిగే అవకాశం ఉంది.
ఈ– -పాలన ద్వారా ప్రజలు తమ హక్కులు, ప్రభుత్వ బాధ్యతలను తెలుసుకునే అవకాశం ఉండటంవల్ల పాలకులు ప్రభుత్వ విధాన నిర్ణయాలలో మార్పులు, నాణ్యమైన పౌరసేవలు అందించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తుంది.
2024 ఏప్రిల్ నాటికి 95.15% గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కలిగిఉండగా 955 మిలియన్ల ఇంటర్నెట్ చందాదారులున్నారు. ప్రస్తుతం 78% ప్రజలు మనదేశంలో మొబైల్ కనెక్షన్స్ కలిగిఉన్నారు. అందుకే, మనదేశం ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ వ్యవస్థ కలిగిన దేశంగా నిలిచింది. మన దేశంలో 40శాతం కంటే ఎక్కువ చెల్లింపులు డిజిటల్ సాధన ద్వారానే జరుగుతున్నాయి.
సవాళ్లు..
ఈ– -గవర్నెన్స్ అమలుకు ప్రభుత్వాలు సాంకేతిక, మానవ వనరుల, పాలనపరమైన అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. జాప్యత, అవినీతి నిర్మూలనలో పూర్తిగా విజయవంతం కాలేకపోయాం. ప్రపంచంలో అవినీతి దేశాల ర్యాంకులలో మనదేశం 96వ స్థానంలో ఉంది. రాజకీయ జోక్యం, ప్రజల అవగాహనాలోపం, అధికారులు ఫైల్ ట్రాకింగ్ పద్ధతిని, సిటిజెన్ చార్టర్ పద్ధతిని అమలుచేసేందుకు ఆసక్తిని చూపకపోవడం లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. అందుకే, ప్రతి ఫైల్ ట్రాక్ చేసే అవకాశం ప్రజలకు కల్పించి సిటిజెన్ ఛార్టర్ పద్ధతిని ఖచ్చితంగా అమలుపరిస్తేగాని ప్రభుత్వంలో అవినీతిని, జాప్యాన్ని తగ్గించే అవకాశం ఉండదు.
- డా. సురేందర్ అడికి,
అసోసియేట్
ప్రొఫెసర్ (రి)