ఎయిర్ ఇండియా ప్రమాదం.. విచారణకు ఉన్నత స్థాయి కమిటీ.. 274 కు చేరిన మృతుల సంఖ్య

ఎయిర్ ఇండియా ప్రమాదం.. విచారణకు ఉన్నత స్థాయి కమిటీ..  274 కు చేరిన మృతుల సంఖ్య

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భారత్ తో పాటు యావత్ ప్రంపచాన్ని కుదిపేసింది. ఇండియా చరిత్రలోనే ఇంతటి విమాన ప్రమాదం ఇప్పటి వరకు జరగలేదు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతూనే ఉంది. శనివారం (జూన్ 14) ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 274కు చేరుకుంది. 

అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయల్దేరిన AI 171 విమానం లేక్ ఆఫ్ అయిన కాసేపటికే నేల కూలడంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గాయాలతో బయటపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే విమాన ప్రమాదాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఘటనకు సంబంధించిన కారణాలను అన్వేషిస్తోంది. బ్లాక్ బాక్స్ లభ్యం అవ్వడంతో ప్రమాదానికి సంబంధించిన కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపనున్నారు. 

ఈ ఘటనపై విచారణ జరిపేందుకు కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.  గురువారం (జూన్ 12) న జరిగిన ప్రమాదానికి గల కారణాలను ఈ కమిటీ విచారించనుంది. అదే విధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విధివిధానాలను రూపొందించి ప్రభుత్వానికి, పౌర విమాన శాఖకు సిఫారసు చేయనుంది. 

►ALSO READ | ఏఐ విమానానికి బెదిరింపు..థాయ్లాండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

భవిష్యత్తులో విమాన ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలను రూపొందించడంపై కమిటీ దృష్టి పెడుతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. మూడు నెలల్లో కమిటి తన నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పిస్తుంది. ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.