
పరిటాల రవి హత్యకేసు నిందితుడు మొద్దు శీనును హత్య చేసిన ఓంప్రకాష్ మృతి చెందాడు. విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. గత కొంత కాలంగా ఓంప్రకాష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు.
హత్య కేసులో జీవిత ఖైదుగా 2016 నుంచి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఓంప్రకాశ్ శిక్షను అనుభవిస్తున్నాడు. శనివారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో…వెంటనే అతన్ని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించినట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. ట్రీట్ మెంట్ పొందుతూనే ఆదివారం ఉదయం ఓం ప్రకాశ్ చనిపోయినట్లు తెలిపారు.
2008 నవంబర్ లో అనంతపురం జిల్లా జైల్లో మొద్దుశీను దారుణ హత్యకు గురయ్యాడు. తాను రామకోటి రాసుకుంటుండగా… జైలు గదిలోని లైటును మొద్దు శీను ఆర్పేశాడని, ఆ కోపంతోనే అతన్ని బండరాయితో మోది హత్య చేసినట్టు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఓంప్రకాశ్ తెలిపాడు.