
- అభివృద్ధి పనులతో మారనున్న స్టేషన్ రూపు రేఖలు
మెదక్, వెలుగు: అమృత్ స్కీంలో భాగంగా మెదక్ రైల్వేస్టేషన్ మోడ్రనైజేషన్ పనులు మొదలయ్యాయి. కాస్ట్ షేరింగ్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.206 కోట్ల వ్యయంతో రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్ పట్టణం వరకు 17.20 కిలో మీటర్ల దూరం కొత్తగా బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తి అయి 2003లో మెదక్ ప్రాంత వాసులకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మెదక్ నుంచి కాచిగూడ వరకు రోజు ఉదయం, సాయంత్రం రైలు నడుస్తోంది. కొన్ని నెలల కింద అక్కన్నపేట నుంచి మెదక్ వరకు రైల్వే లైన్ ఎలెక్ట్రిఫికేషన్ కూడా పూర్తయింది. ఈ రూట్లో ఎలెక్ట్రిక్ రైళ్లు రాకపోకలు సాగించేందుకు వీలు కలిగింది.
అక్కన్న పేట, మెదక్ రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చాక హైదరాబాద్ నుంచి మెదక్ రైల్లో రాకపోకలు సాగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. టికెట్ల ద్వారా రైల్వే శాఖకు నిత్యం వేలల్లో ఆదాయం సమకూరుతోంది. గూడ్స్ రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి మెదక్ కు ఎరువులు వస్తుండగా, మెదక్ నుంచి తమిళనాడు, కర్నాటక, కేరళకు బియ్యం రవాణా జరుగుతోంది. తద్వారా మెదక్ స్టేషన్ కు మెరుగైన ఆదాయం సమకూరుతుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మెదక్ రైల్వే స్టేషన్ ను ఆధునికీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు అమృత్ భారత్ స్కీమ్ కింద మెదక్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కోసం రూ.15.23 కోట్లు మంజూరు చేసింది.
కొనసాగుతున్న పనులు..
గత ఏడాది ఫిబ్రవరి 26న పీఎం నరేంద్ర మోదీ వర్చువల్ గా అమృత్ భారత్ పథకం పనులకు శంకుస్థాపన చేశారు. పనులు కొంత ఆలస్యంగా ప్రారంభం కాగా ప్రస్తుతం వివిధ పనులు కొనసాగుతున్నాయి. ప్లాట్ ఫారం పక్కన గోడ నిర్మాణం చేపట్టారు. అమృత్ స్కీమ్ కింద ప్లాట్ ఫారం, ఎంట్రెన్స్ ల ఆధునికీకరణ, పార్కింగ్ షెడ్ల నిర్మాణం, సెల్ఫీ పాయింట్, లిఫ్ట్ సదుపాయం, దివ్యాంగుల కోసం ర్యాంప్, టాయిలెట్స్, ఇన్ఫర్మేషన్ బోర్డుల ఏర్పాటు, ల్యాండ్ స్కేపింగ్, విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్ సౌకర్యం కల్పించనున్నారు. ఇటీవల మెదక్ ఎంపీ రఘునందన్ రావు మెదక్ రైల్వే స్టేషన్ ను సందర్శించి అమృత్ భారత్ స్కీమ్ కింద చేపడుతున్న పనులను పరిశీలించారు.