
అహ్మాదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. జూన్ 13న విజయ్ రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మోదీ అంతకు ముందు విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. తర్వాత ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం విజయ్ రూపానీ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
జూన్ 12 మధ్యాహ్నం అహ్మదాబాద్ లోని మేఘని నగర్లోని నివాస ప్రాంతంలో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది ప్రయాణికులలో మాజీ సీఎం 68 ఏళ్ల రూపానీ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారందరూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. విజయ్ రూపానీ లండన్ లో ఉన్న తన కూతురిని చూడటానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
►ALSO READ | అహ్మదాబాద్ విమాన ప్రమాదం..డిజిటల్ వీడియో రికార్డర్ (DVR) దొరికింది
విజయ్ రూపానీ 1987లో రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. ఆయన రాజ్కోట్ మేయర్గా (1996–1997), రాజ్యసభ ఎంపీగా (2006–2012), 2016లో గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.