హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో కరోనా బారిన పడిన తొలి వ్యక్తి, సికింద్రాబాద్కు చెందిన రామ్తో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ఫిబ్రవరిలో ఆఫీస్ పని మీద దుబాయి వెళ్లిన రామ్కు, అక్కడ వైరస్ సోకింది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత అది బయటపడింది. మార్చ్1న గాంధీ హాస్పిటల్లో చేరగా, 2వ తేదీన ఆయనకు వైరస్ పాజిటివ్ వచ్చినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. గాంధీ డాక్టర్లు ఇచ్చిన ట్రీట్మెంట్తో కోలుకున్న రామ్, ఈ నెల 13న రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ను జయించిన ఆయనతో, మన్ కీ బాత్ సందర్భంగా మోడీ మాట్లాడారు.
రామ్: నమస్కారమండీ.
మోడీ: ఎవరు? రామ్ గారేనా మాట్లాడేది.
రామ్: అవును సర్. రామ్ను మాట్లాడుతున్నాను.
మోడీ: రామ్ నమస్తే.
రామ్: నమస్తే సార్.
మోడీ: మీరు కరోనా వైరస్ నుంచి బయటపడ్డారని విన్నాను.
రామ్: అవును సార్.
మోడీ: చెప్పండి రామ్. మీరు కరోనా నుంచి ఎలా బయటపడ్డారు. మీ అనుభవాలు వినాలనుకుంటున్నాను.
రామ్: నేను ఐటీ ఉద్యోగిని. పనిలో భాగంగా మీటింగ్స్ కోసం దూబాయ్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ అనుకోకుండా అలా జరిగిపోయింది. తిరిగి రాగానే జ్వరం మొదలైంది. ఆ తర్వాత ఐదారు రోజులకు డాక్టర్లు కరోనా వైరస్ పరీక్షలు జరిపారు. అప్పుడు పాజిటివ్ వచ్చింది. వెంటనే గాంధీ హాస్పిటల్లో నన్ను చేర్చారు. ఆ తర్వాత 14 రోజులకు నయమైంది. డిశ్చార్జి చేశారు. నిజంగా అదంతా ఎంతో భయంకరంగా సాగింది.
మోడీ: ఈ వైరస్ భయంకరమైనదని ముందే తెలుసుకదా! జ్వరంతో బాధ పడుతున్నారు కదా.
రామ్: అవును సార్.
మోడీ: వైరస్ సోకిన విషయం తెలియగానే మీకు ఏమనిపించింది.
రామ్: ఒక్కసారిగా భయం వేసింది. నమ్మలేకపోయాను. ఇట్లా ఎట్లా జరిగిందో అర్థం కాలేదు. ఎందుకంటే భారత దేశంలో కేవలం ఇద్దరి, ముగ్గురికే ఈ వ్యాధి సోకింది. అందుకే ఏమీ అర్థం కాలేదు. ఆస్పత్రిలో చేరిన తర్వాత నన్ను ఐసోలేషన్లో ఉంచారు. రెండు, మూడు రోజులు అలాగే గడిచిపోయాయి. అక్కడ ఉన్న డాక్టర్లు, నర్సులు ఎంతో మంచివాళ్లు. ప్రతిరోజూ నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్లు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవాళ్లు. నాకు ఏమీ కాదన్న నమ్మకాన్ని కలిగించే వాళ్లు. మీరు తొందరగా కోలుకుంటారు. అంటూ ధైర్యం చెప్పేవాళ్లు. పగటి పూట ఇద్దరు, ముగ్గురు డాక్టర్లు మాట్లాడేవాళ్లు. నర్సులు కూడా మాట్లాడేవాళ్లు. మొదట్లో భయం వేసింది. కానీ క్రమంగా ఇంతమంది మంచివాళ్ల మధ్య ఉన్న కారణంగా నాకేమీ కాదన్న నమ్మకం కుదిరింది. ఏంచేయాలో వాళ్లకి తెలుసు. తప్పనిసరిగా నాకు మెరుగవుతుంది అన్న విశ్వాసం పెరిగింది.
మోడీ: మీ కుటుంబ సభ్యుల మానసిక స్థితి ఎట్లా ఉండేది.
రామ్: నేను హాస్పిటల్లో చేరిన మొదట్లో వాళ్లు ఎంతో ఆందోళనకు గురయ్యారు. ఆతర్వాత మా కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేశారు. నెగిటివ్ వచ్చింది. నాకూ, నా కుటుంబ సభ్యులకూ, చుట్టు పక్కల వారికి కూడా ఎంతో ఊరటనిచ్చింది. ఆ తర్వాత రోజురోజుకీ నా పరిస్థితిలో మెరుగుదల కన్పించింది. డాక్టర్లు మాతో మాట్లాడేవారు. కుటుంబ సభ్యులకు కూడా విషయాలు చెప్పేవారు. వారు ఏఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఏవిధంగా చికిత్స చేస్తున్నారో అన్ని విషయాలు కుటుంబ సభ్యులకు తెలిపేవారు.
మోడీ: మీరు స్వయంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవారు. మీ కుటుంబ సభ్యులు ఏ ఏ జాగ్రత్తలు తీసుకునేవారు?
రామ్: నేను ఐసోలేషన్లోకి వెళ్లిన తర్వాతే, వైరస్ ఉన్న విషయం తెలిసింది. కుటుంబ సభ్యులను 14 రోజులు ఇంటి దగ్గరే ఒక గదిలో ఉండాలని చెప్పారు. వారిని ఇంట్లో తమకుతాముగా క్వారంటైన్లో ఉండాలని కోరారు. నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంట్లోనే ఒక గదిలో ఉండేవాన్ని.. దాదాపుగా రోజంతా ఎక్కువసేపు మాస్క్ తగిలించుకొని ఉండేవాన్ని. తినడానికి గదిలోంచి బయటికి వచ్చే ముందు చేతులను శుభ్రంగా కడుక్కునేవాడిని. ఇది ఎంతో ముఖ్యం.
మోడీ: సరే రామ్.. మీరు ఆరోగ్యం పుంజుకొని బయటికి వచ్చారు. మీకు, మీకుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు.
రామ్: థాంక్యూ సార్.
మోడీ: రామ్, మీ అనుభవాన్ని ఇతరులతో పంచుకోండి. ఆడియో మెసేజ్ రూపొందించి. సోషల్ మీడియాలో వైరల్ చేయండి. ఈ విధంగా చేస్తే ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా ఉంటారు. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుస్తుంది. ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి దూరంగా ఉండడానికి, తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు.
రామ్: అవును సార్. బయటికి వచ్చాక చూస్తున్నాను. క్వారంటైన్ అంటే తమకు తాము జైలులో ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇది నిజంగా అలాంటిది కాదు. అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చెబుతున్న క్వారంటైన్ కేవలం వారికే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా మంచిది. అందుకే.. ఎంతో మందికి ఈ విషయాలను చెప్పాలనుకుంటున్నాను. పరీక్షలు చేయించుకోండి. క్వారంటైన్ అంటే భయపడకండి. క్వారంటైన్ అంటే అదేదో మచ్చలాంటిది అనుకోకండి.
మోడీ: గుడ్ రామ్.
రామ్: థాంక్యూ సర్, సార్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను.
మోడీ: ఆ చెప్పండి… చెప్పండి.
రామ్: నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు తీసుకున్న చర్యలు ప్రపంచంలో ఏ దేశం కూడా తమ పౌరుల కోసం తీసుకోలేదు. అంతేకాదు మీ కారణంగా మేమందరం కూడా క్షేమంగా బయట పడగలమని ఆశిస్తున్నాను.
మోడీ: ఈ వైపరిత్యం నుంచి దేశం బయటపడాలి. ఇది ఎంతో భయానకమైన పరిస్థితి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితి.
రామ్: ఏమీ కాదు సార్. మొదట్లో భయం వేసింది. మీరు లాక్ డౌన్ ప్రకటించినప్పుడు. మీరు తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది. మనందరం మీ సహాయంతో బయటపడతాం సార్.
మోడీ: థాంక్యూ బ్రదర్
రామ్: థాంక్యూ సర్.