- త్వరలో చూడబోతున్నాం.. అక్కడి యువతే చేసి చూపిస్తుంది: మోడీ
- వాళ్లే లీడర్లవుతారు.. వాళ్లే సీఎంలవుతారు.. ఆర్టికల్ 370 రద్దుతో నవ శకం షురూ
- ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం.. అందరితో సమానంగా కాశ్మీరీలకు అవకాశాలు
- హిందీ, తెలుగు, తమిళ్ సినిమా ఇండస్ట్రీకి వెల్కమ్.. కళాకారులు, క్రీడాకారులను ప్రోత్సహిద్దాం
- జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం.. త్వరలోనే మళ్లీ రాష్ట్రంగా మారుతుందని భరోసా
మార్గం చూపుదాం
భూతల స్వర్గం కాశ్మీర్ వికాసానికి కలిసి నడుద్దామని మోడీ పిలుపునిచ్చారు. ఇందుకు కాశ్మీరీ యువతే నాయకత్వం వహించాలన్నారు. ‘‘టూరిజం రంగంలో కాశ్మీర్ను అత్యున్నత స్థాయిలో నిలబెడదాం. ఒకప్పుడు ఇక్కడ అనేక సినిమా షూటింగ్లు జరిగేవి. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ మళ్లీ సినిమా షూటింగ్లు చేపట్టండి. కాశ్మీర్ అందాలను ప్రపంచానికి చాటి చెప్పండి” అని కోరారు. ఇక్కడ ఎందరో కళాకారులు ఉన్నారని, ఎందరో ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులు ఉన్నారని, వారికి మార్గం చూపాలని సూచించారు. కొత్త స్పోర్ట్స్ అకాడమీలు, స్టేడియాలు ఏర్పాటు చేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుతో వంచనలకు, అన్యాయాలకు కాలం చెల్లిందని, జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి దేశ ప్రజలందరూ కలిసి నడువాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. నవ శకం ప్రారంభమైందని, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబా సాహెబ్ అంబేడ్కర్, శ్యామ ప్రసాద్ ముఖర్జీ, అటల్జీ వంటి కోట్లాది మంది దేశ భక్తుల కల నిజమైందని అన్నారు. త్వరలోనే కాశ్మీర్లో కమాల్ జరుగబోతోందని, యువతే అది సాధించి చూపుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని చట్టాలన్నీ ఇక నుంచి కాశ్మీర్కు కూడా వర్తిస్తాయన్నారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ విభజన తర్వాత తొలిసారి గురువారం ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఆయన ప్రసంగం సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఆర్టికల్ 370 వల్ల జమ్మూకాశ్మీర్ ప్రజలు హక్కులు కోల్పోయారని, అన్యాయాలకు గురయ్యారని ప్రధాని అన్నారు. ఈ ఆర్టికల్ అమలును ఆయుధంగా చేసుకొని పాకిస్తాన్ టెర్రరిజాన్ని రెచ్చగొట్టిందని దుయ్యబట్టారు. కాశ్మీర్లో పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చేందుకు పిడికెడు మంది ప్రయత్నిస్తున్నారని, వారి ఆటలు సాగబోవని హెచ్చరించారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రజల సుఖదుఃఖాల్లో భాగం పంచుకొనేందుకు దేశం మొత్తం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.
ఆ ఆర్టికల్తో ఏం ఒరిగింది?
‘‘జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఆర్టికల్ 370తో ఏం ఒరిగింది? దాని వల్ల 60, 70 ఏండ్ల నుంచి ఎన్నో అన్యాయాలు ఎదుర్కొన్నారు. ఎన్నో హక్కులు కోల్పోయారు” అని మోడీ అన్నారు. ఈ ఆర్టికల్ వల్ల కుటుంబ పాలన, టెర్రరిస్టులు, వేర్పాటువాదులు, అవినీతిపరులు బాగుపడ్డారని, జనం మాత్రం అభివృద్ధికి దూరమయ్యారని తెలిపారు. ‘‘కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా పార్లమెంట్లో చట్టాలు చేయడం నిరంతర ప్రక్రియ. అలా చేసే చట్టాలు దేశంలోని ఒక రాష్ట్రానికి వర్తించవంటే ఎలా ఉంటుంది. అది ఊహకు కూడా అందదు. జమ్మూకాశ్మీర్ విషయంలో ఇన్నాళ్లూ అదే జరిగింది” అని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నదని, టూరిజం హబ్గా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ‘‘దేశంలోని ప్రతి బిడ్డకు చదువుకునే హక్కు ఉంది. మరి, జమ్మూకాశ్మీర్లోని బిడ్డలు ఏ పాపం చేశారు. వారికి ఇన్నాళ్లూ ఎందుకు ఆ హక్కు దక్కలేదు? దేశంలో కార్మికులకు, రైతులకు, దళితులకు, మహిళలకు, మైనారిటీలకు హక్కులు ఉన్నాయి. మరి ఆ హక్కులు జమ్మూకాశ్మీర్లో వారికి దక్కాయా? ఇక్కడి 1.5 కోట్ల మంది దేశంలోని ఇతర ప్రాంతాల్లోని వారికి సమానంగా అభివృద్ధి ఫలాలను అందుకోలేకపోయారు. దీనంతటికీ కారణం ఆర్టికల్ 370… దాని అనుబంధంగా ఉన్న ఆర్టికల్ 35ఏ. వీటి రద్దుతో అసమానతలు దూరమయ్యాయి. దేశమంతా ఒక్కటనే భావన ఏర్పడింది. ఒకటే ఇండియా.. ఒకటే రాజ్యాంగం కల సాకారమైంది” అని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ పోలీసులకు కూడా ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హోదా లభిస్తుందన్నారు. ఇన్నేండ్ల స్వాతంత్ర్య దేశంలో జమ్మూకాశ్మీర్ గురించి ఏ ప్రభుత్వమైనా పట్టించుకుందా? అని మోడీ ప్రశ్నించారు. అక్కడి అన్యాయాల గురించి కనీసం చర్చలైనా జరిపారా అని నిలదీశారు. జమ్మూకాశ్మీర్ కోసం మూడు దశాబ్దాల్లో 42వేల మంది అమాయకులు ప్రాణాలు వదిలారని తెలిపారు. ఎంతో ఆలోచించి ఆర్టికల్ 370ని రద్దు చేశామని చెప్పారు.
సోలో.. ఓ సంజీవని
ఆర్గానిక్ ఉత్పత్తులకు పెట్టింది పేరు లడఖ్ అని, ఆ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్కు అందజేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. లడఖ్లో దొరికే సోలో అనే మూలిక ఆక్సిజన్ తక్కువగా ఉండే ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో నివసించేవారికి సంజీవినిలా పనిచేస్తుందని తెలిపారు. ఇంతంటి ఔషధ మూలికలను ప్రపంచానికి పరిచయం చేయాల్సి అవసరం ఉందని చెప్పారు. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా లడఖ్ అభివృద్ధి చెందుతుందని, సోలార్ పవర్ జనరేషన్కు కూడా ఇది కేంద్ర బిందువు అవుతుందని తెలిపారు.
త్వరలోనే రాష్ట్ర హోదా.. యువతే లీడర్స్
వేర్పాటువాదుల నుంచి, టెర్రరిస్టుల నుంచి జమ్మూకాశ్మీర్కు విముక్తి కల్పించాల్సిన తరుణం ఇదేనని మోడీ అన్నారు. కలలను సాకారం చేసుకోవాల్సి హక్కు అందరికీ ఉంటుందని, ఇక్కడి వాళ్లకు కూడా ఆ హక్కు ఉందని చెప్పారు. త్వరలోనే జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రజలకు ఫలాలు దక్కుతాయని తెలిపారు. ‘‘జమ్మూకాశ్మీర్ ప్రజలకు భరోసా ఇస్తున్నాను.. త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. సమస్యలు పరిష్కారమవుతాయి. పరిస్థితులు సర్దుకున్నాక తిరిగి రాష్ట్ర హోదా దక్కుతుంది. ఇక్కడి యువత నుంచే లీడర్లు వస్తారు.. ఇక్కడి యువత నుంచే ముఖ్యమంత్రులు వస్తారు. కాశ్మీర్లో కమాల్ జరగబోతోంది. ఇన్నాళ్లూ కొన్ని కుటుంబాలు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేవి. ఇక ఆ పరిస్థితులు ఉండవు’’ అని అన్నారు.
ఎందరో వీరులు
దేశం కోసం ప్రాణాలర్పించిన జమ్మూకాశ్మీర్ వీరులను ఎప్పటికీ మరిచిపోలేమని ప్రధాని అన్నారు. పూంఛ్ జిల్లా నుంచి మౌల్వి గులాం, లడక్ నుంచి వాంఛూ, రాజౌరి నుంచి కౌసర్ ఇలా ఎందరో వీరులు దేశ సేవలో తరించారని కొనియాడారు. టెర్రరిస్టులపై పోరాడిన వారి స్ఫూర్తితో కశ్మీర్ యువత ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్లో త్వరలోనే శాంతిస్థాపన జరుగుతుందని, ఇక్కడి శాంతి ప్రక్రియ విశ్వశాంతికి కొత్త దారిని చూపుతుందని మోడీ ఆకాంక్షించారు. శాంతియుత కాశ్మీర్ కావాలని ప్రతి ఇండియన్ కోరుకుంటున్నాడని చెప్పారు. ‘‘రండి.. అందరం కలిసి మన సత్తా ఏమిటో ప్రపంచానికి చూపుదాం. నయా భారత్లో నయా జమ్మూకాశ్మీర్, నయా లడఖ్ నిర్మించుకుందాం. టెర్రరిస్టులు, వేర్పాటువాదుల నుంచి జమ్మూకాశ్మీర్ను కాపాడుకుందాం. కొత్త స్వప్నం దిశగా పయనిద్దాం” అని పిలుపునిచ్చారు. త్వరలోనే ఈద్ జరుపుకోబోతున్నామని, జమ్మూకాశ్మీర్లోనూ ప్రశాంత వాతావరణంలో ఈద్ జరుగుతుందని, ఆయన ముబారక్ చెప్పారు.
రాష్ట్రపతి పాలనతో మార్పు
జమ్మూకాశ్మీర్లో రాష్ట్రపతి పాలనతో ఎంతో మార్పు వచ్చిందని, పరిస్థితులు మెరుగుపడ్డాయని, డెవలప్మెంట్ జరుగుతోందని ప్రధాని చెప్పారు. రాష్ట్రపతి పాలన కోసం తాము చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. 5 నెలల క్రితం ఇక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచినవాళ్లంతా బాగా పనిచేస్తు న్నారని, మహిళలకూ పోటీ చేసే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి వాళ్లు కృషి చేస్తున్నారని, ఇటీవల వారిని తాను కలిసినప్పుడు చాలా ఆనందం వేసిందన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్ పంచాయతీల్లో కొత్త వ్యవస్థలో పనిచేసే అవకాశం యువ నేతలకు దక్కుతుందని, వాళ్లు కమాల్ చేసి చూపిస్తారన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
హద్దులు దాటొద్దు! పాకిస్తాన్కు అమెరికా హెచ్చరిక
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ను కేంద్రం యూటీలుగా విభజించిన నేపథ్యంలో అగ్గిమీద గుగ్గిలం అవుతున్న పాకిస్తాన్ కు అమెరికా హద్దులు దాటొద్దని హెచ్చరించింది. ఇండియా నిర్ణయాన్ని తాము పరిశీలిస్తున్నామని, సంయమనం పాటించాలని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాక్ ప్రతీకారేచ్ఛతో చొరబాట్లను ప్రేరేపించడం వంటివి చేయొద్దన్నారు. జమ్మూకాశ్మీర్ను యూటీలుగా విభజించడంపై చట్టపరమైన అంశాలను తాము అధ్యయనం చేస్తున్నామని, ఆ ప్రాంతంలో అస్థిరత్వం ఏర్పడే అవకాశాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. దక్షిణాసియాలో సైనిక ఉద్రిక్తతలు రేగకుండా, ఘర్షణలు పెరగకుండా ఉండేందుకు జమ్మూకాశ్మీర్ అంశంపై ఇండియా, పాకిస్తాన్వెంటనే నేరుగా చర్చలు జరపాలని, అందుకు అమెరికా మద్దతిస్తుందని తెలిపారు.