మొగుళ్లపల్లి,వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో లక్షలు వెచ్చించి నిర్మించిన కొత్త బస్టాండ్ ఏండ్ల తరబడి ప్రారంభానికి నోచుకోకుండా నిరుపయోగంగా మారింది. జమ్మికుంట, పరకాల, భూపాలపల్లి ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు బస్టాండ్ లేకపోవడంతో ఆలయాలు, వ్యాపారుల దుకాణాల ముందు గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోంది.
మరోవైపు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నాసిరకం టైల్స్ వేయడంతో బస్టాండ్ ప్రారంభానికి ముందే అక్కడక్కడా ధ్వంసమవుతున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు సైతం దెబ్బతింటున్నాయి. పరిసరాల్లో పిచ్చిమొక్కలు, గడ్డి ఏపుగా పెరిగి అపరిశుభ్రంగా మారాయి. దీంతో ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్పందించి బస్టాండ్ను ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
