రేపు(డిసెంబర్ 13) ప్రమాణస్వీకారం.. చేయనున్న మధ్యప్రదేశ్ సీఎం

రేపు(డిసెంబర్ 13) ప్రమాణస్వీకారం..  చేయనున్న మధ్యప్రదేశ్ సీఎం

మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ 2023 డిసెంబర్ 13న ప్రమాణస్వీకారం చేయనున్నారు.   భోపాల్‌లో జరిగే వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర సీనియర్ నేతలు హాజరుకానున్నారు. 

మధ్యప్రదేశ్ కొత్త ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు రాజేంద్ర శుక్లా (రేవా నియోజకవర్గం), మాజీ మంత్రి జగదీశ్ డియోరా డిప్యూటీ సీఎంలుగా ఉంటారు. పార్టీ సీనియర్ లీడర్, కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అసెంబ్లీ స్పీకర్​గా వ్యవహరిస్తారు. సీఎం పోస్టుకు మోహన్ యాదవ్ పేరును మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సిఫార్సు చేసినట్లు ఆ పార్టీ లీడర్ కైలాష్ విజయ్ వర్గీయ తెలిపారు.

మోహన్ యాదవ్ ప్రొఫైల్

మోహన్‌‌ యాదవ్‌‌.. 25 మార్చి, 1965లో ఉజ్జయినిలో పూనమ్ చంద్, సీమా యాదవ్ దంపతులకు పుట్టారు. బీఎస్సీ, ఎల్ఎల్​బీ, ఎంఏ, ఎంబీఏ, పీహెచ్​డీ చదివారు. 1982లో పొలిటికల్ కెరీర్ ప్రారంభమైంది. స్టూడెంట్ యూనియన్ లీడర్​గా పనిచేశారు. 2013లో ఉజ్జయిని సౌత్ నుంచి తొలిసారి గెలిచారు. 2018లో గెలిచి విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. తాజాగా సీఎం బాధ్యతలు చేపట్టనున్నారు.

మోదీ లీడర్​షిప్​లో పనిచేస్తా: మోహన్ యాదవ్

సీఎంగా అవకాశం ఇవ్వడంపై మోహన్ యాదవ్ స్పందించారు. ఎంతో నమ్మకంతో సీఎం బాధ్యతలు అప్పగించినందుకు బీజేపీ హైకమాండ్ ధన్యవాదాలు చెప్పారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాను. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తాను’ అని యాదవ్ చెప్పారు.