- ఇది ఒక రూల్.. ప్రభుత్వం ఏమీ చేయలేదు: సీఎం రేవంత్
న్యూఢిల్లీ, వెలుగు: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఈ కేసులో డ్రగ్స్ తీసుకున్న వారు బాధితులమంటూ ప్లే కార్డు చూపిస్తూ పలువురు స్టేషన్ బెయిల్ పొందారని చెప్పారు. ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదన్నారు. బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎంపీ పుట్ట మహేశ్, ఇతరులకు బెయిల్ దక్కడంపై స్పందిస్తూ.. డ్రగ్స్ కేసులో బాధితుల పేరుతో కోర్టును ఆశ్రయించిన వారు స్టేషన్ బెయిల్ పొందారని చెప్పారు. ఇది ఒక రూల్ అని, స్టేషన్ బెయిల్ పొందే అవకాశం ఉందన్నారు. ఇందులో ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. ఈ కేసుపై పూర్తి దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
2029లోనే ఎలక్షన్స్
తెలంగాణలో 2029లోనే అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయని సీఎం రేవంత్ స్పష్టంచేశారు. 2028లోనే ఎన్నికలంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ జన గణన నిర్వహించాల్సి ఉందని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా నియోజక వర్గాల పున:వ్యవస్థీకరణ జరుగుతుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్లకు తాము సహకరిస్తామని పేర్కొన్నారు.
