- మొయినాబాద్ యువతి మృతి కేసులో వీడిన మిస్టరీ
- న్యూ మల్లేపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని తహసీన్గా గుర్తింపు
- విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఎస్ఐ సస్పెండ్ , సీఐకి మెమో
హైదరాబాద్, వెలుగు : మొయినాబాద్లో యువతి అనుమానాస్పద మృతిలో మిస్టరీ వీడింది. స్నేహితురాళ్లు దూరం పెట్టారనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారం జాగీర్ సమీపంలో 5 రోజుల కిందట గుర్తు తెలియని యువతి డెడ్బాడీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్లు,సెల్ఫోన్ టవర్ లొకేషన్, ఆటోనంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఆమె మృతి కారణాలను తేల్చారు. శుక్రవారం మొయినాబాద్ పోలీసులు మీడియాకు వివరాలు తెలిపారు.
సిటీలోని న్యూ మల్లేపల్లికి చెందిన తహసీన్బేగం(22) మెహిదీపట్నంలోని మదీనా కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆమె కాలేజ్ ఫ్రెండ్ రహిల్లో పాటు మరో ఇద్దరు స్నేహితురాళ్లు పరిచయం అయ్యారు. రహిల్ ప్రాణస్నేహితురాలు అయేషాలు తహసీన్ను దూరం పెట్టారు. దీంతో మానసిన వేదనకు గురైన ఆమె రెండుసార్లు చేతులు కట్ చేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో న్యూ మల్లేపల్లి నుంచి మొయినాబాద్ డ్రీమ్ వ్యాలీకి రూ.1100తో ఆటోను మాట్లాడుకుంది. ముందుగా మురాద్నగర్లోని ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి హుమాయున్నగర్లోని రాయల్ కాలనీలోని మరో ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది.
లాస్ట్ కాల్తో దర్యాప్తు చేయగా..
అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరింది. అంతకు ముందే 5 లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి తన బ్యాగ్లో పెట్టుకుంది.1.43 గంటలకు మొయినాబాద్ మండలం బాకారం జాగీర్ సమీపంలోకి వెళ్లింది. ఆటో డ్రైవర్కు రూ.1100 ఇచ్చింది. ఆటో డ్రైవర్ వెళ్లిన తర్వాత 1.53 గంటలకు తన ఫ్రెండ్ రహిల్తో ఫోన్ లో మాట్లాడింది. ఆ తర్వాత పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు సమాచారం ఇవ్వగా పోలీసులు వెళ్లి పరిశీలించగా ఆధారాలు లభించకపోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంకేపల్లి లోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆటోను.. టవర్ లొకేషన్ ఆధారంగా మృతురాలు చేసిన చివరి ఫోన్ కాల్ను గుర్తించారు.
ఎస్ఐ సస్పెండ్, సీఐకి మెమో
ఈ కేసులో హబీబ్నగర్ పోలీసుపై సిటీ సీపీ శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. తహసీన్బేగం మిస్సింగ్ పై ఫిర్యాదు వచ్చినా ఎఫ్ఐఆర్ చేయకపోవడంపై ఎస్ఐ భాను ప్రకాశ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఇన్స్పెక్టర్ రాంబాబుకు మెమో జారీ చేశారు. తహసీన్బేగం అదృశ్యంమై ఆమె సోదరుడు మహ్మద్ అజహర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పోలీసులు నిర్లక్ష్యం వహించారని బాధిత కుటుంబం ఆరోపించింది. దీంతో సీపీ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం హబీబ్నగర్ పీఎస్ను సందర్శించారు. కేసు వివరాలు తెలుసుకుని ఎస్ఐ, ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకున్నారు.