రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. నవంబర్ 19 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని తెలిపారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై , పత్తి రైతుల సమస్యలపై సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా, జిన్నింగ్ మిల్లర్ల అసోషియేషన్ చర్చలు సఫలమయ్యాయని చెప్పారు. నవంబర్ 19 నుంచి యదావిథిగా పత్తి కొనుగోళ్లు జరుగుతాయని.. త్వరలోనే అన్ని జిల్లాలలో జిన్నింగ్ మిల్లులు ప్రారంభం అవుతాయని చెప్పారు. రైతులు ప్రతిపక్ష నాయకుల ఉచ్చులో పడొద్దని సూచించారు తుమ్మల. ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని జిన్నింగ్ మిల్లర్లకు మంత్రి హామీ ఇచ్చారు.
పత్తి కొనుగోళ్లలో సీసీఐ అమలు చేస్తున్న కఠిన నిబంధనలపై కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నవంబర్ 17 నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించింది. కపాస్ కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్ విధానం, ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేయడం, అన్ని కొనుగోలు కేంద్రాలను ఒకేసారి ప్రారంభించకుండా దశలవారీగా తెరవడం వల్ల రైతులతో పాటు జిన్నింగ్ మిల్లులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నవంబర్ 17న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో మంత్రి తుమ్మల, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. సీసీఐ కొనుగోళ్లకు కేంద్రం విధించిన తేమ నిబంధనలను సడలించాలని, ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటామన్న షరతును వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి సీసీఐ సభ్యులతో చర్చలు జరిపారు మంత్రి తుమ్మల.
►ALSO READ | పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలిసేలా పెంచాలి: సరోజ వివేక్
రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో 45.85 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. కాగా, 27 లక్షల టన్నుల పత్తి పంట దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. ఇప్పటి వరకు సీసీఐ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్ల ద్వారా కేవలం 67వేల మంది రైతుల నుంచి 1.18 లక్షల టన్నుల పత్తి మాత్రమే కొనుగోలు చేసింది.
